బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (11:55 IST)

టిటిడి ఛైర్మన్‌గా బీద మస్తాన్ రావు? రాయపాటికి మరోమారు మొండిచేయి!

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఛైర్మన్‌ పదవికి బీదా మస్తాన్‌రావును నియమించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొందరు నేతల నుంచి ఛైర్మన్‌ పదవికి సంబంధించిన అభ్యర్థ

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఛైర్మన్‌ పదవికి బీదా మస్తాన్‌రావును నియమించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొందరు నేతల నుంచి ఛైర్మన్‌ పదవికి సంబంధించిన అభ్యర్థి ఎంపిక విషయంలో చర్చించినట్లు తెలసింది. కొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తితిదే ఛైర్మన్ పీఠం కోసం నర్సారావు పేట ఎంపీగా ఉన్న రాయపాటి శ్రీనివాసరావు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. కానీ, ఆయనకు ఈ దఫా కూడా మొండిచేయి చూపించనున్నారు. 
 
పార్టీలో ఆది నుంచి అంటిపెట్టుకుని పార్టీ కష్టాకాలంలో ఉన్న సమయంలో కూడా జిల్లాలో పార్టీని నడిపించిన వ్యక్తికి ఉన్నతమైన పదవిని ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారట. ఇదేసమయంలో పారిశ్రామికవేత్తగా, ఉన్నత విద్యా వంతునిగా ఉన్న బీదా మస్తాన్‌రావును నియమిస్తే ఎలా ఉంటుందనే కోణంలో జిల్లా పార్టీ నాయకుల నుంచి కూడా అభిప్రాయాన్ని సేకరించినట్టు సమాచారం. అందరి నుంచి సానుకూలత వ్యక్తం కావటంతో మస్తాన్‌రావును ఛైర్మన్‌ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. 
 
కాగా, బీద మస్తాన్ రావు.. తెదేపా ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమానికి ఆకర్షితులై పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తొలుత బోగోలు జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందారు. అక్కడి నుంచి అల్లూరు ఎమ్మెల్యేగా బరిలో దిగి ఓటమిపాలయ్యారు. దీని తర్వాత 2009లో కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్న గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
 
పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించినా చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టారు. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షునిగా బీద రవిచంద్రను మరోసారి కొనసాగించారు. జిల్లాలో వివిధ వర్గాలతో సమన్వయంతో పనిచేయటమే బీద కుటుంబానికి కలిసొచ్చింది. పార్టీలో వారికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడే అవకాశం లేకుండా అందరితో సన్నిహితంగా వ్యవహరిస్తారన్న ముద్ర ఉంది. 
 
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో అనూహ్యంగా బీదా రవిచంద్ర పేరు తెరపైకి వచ్చింది. కానీ, కొన్ని సర్దుబాట్ల నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అవకాశం కల్పించారు. అప్పట్లోనే పార్టీ తరపున కీలకమైన పదవి ఇస్తామన్న హామీ చంద్రబాబు నుంచి ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా బీదా మస్తాన్‌రావుకు తితిదే ఛైర్మన్‌ పదవి లభించే అవకాశం ఉందని సమాచారం.