గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (12:41 IST)

వివాదాలకు నిలయంగా హథీరాంజీ మఠం... ఆందోళన బాటలో సాధువులు

శ్రీవారి పరమభక్తుడు హథీరాంజీ బావాజీ అచంలమైన భక్తివిశ్వాసాలకు మెచ్చిన కలియుగ వేంకటేశ్వరస్వామి వారు తనను సేవించుకునే భాగ్యం కల్పించారు. బావాజీ భక్తి ప్రపత్తులే తిరుమల మొదటి పాలనాధికారిని చేశాయి. తొలి మహ

శ్రీవారి పరమభక్తుడు హథీరాంజీ బావాజీ అచంచలమైన భక్తివిశ్వాసాలకు మెచ్చిన కలియుగ వేంకటేశ్వరస్వామి తనను సేవించుకునే భాగ్యం కల్పించారు. బావాజీ భక్తి ప్రపత్తులే తిరుమల మొదటి పాలనాధికారిని చేశాయి. తొలి మహంతుగా తిరుమలేశుని పరమభక్తుడుగా ఆయన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారు. స్వామి కొలువులో ఉంటూనే సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. సాధువులు, బంజారాలు, బైరాగీలను గౌరవించాలనే ఉన్నత లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలని చేపట్టారు. హథీరాంజీ బావాజీ వ్యక్తిత్వాన్ని మెచ్చిన అలనాటి రాజులు పాలనాభారాన్ని వారిపై మోపినట్లు చారిత్రక కథనం. స్వామీజీపై నమ్మకంతో అప్పటి రాజులు శ్రీవారి భక్తులు, భూములను, బంగారు, వెండి, వజ్రవైఢ్యూర్యాలను కానుకలుగా సమర్పించినట్లు తెలుస్తోంది. శ్రీవారికృపతో బావాజీకి లభించిన అవకాశం ఎనలేనిది. శ్రీనివాసుడి సేవలో ఇప్పటికీ ఆదర్శంగా నిలిచాయి. 
 
ఆధునికయుగానికి స్ఫూర్తిగా నిలబడటంతో పాటు ఆధ్మాత్మిక వైపు బాటలు వేశాయి. అయితే ప్రయాగదాసు హయాం వరకు హథీరాంజీ మఠానికి మచ్చలేనప్పటికీ ఆ తర్వాత వచ్చిన మఠాధిపతులు వల్ల అపఖ్యాతి మూటకట్టుకోవాల్సి వచ్చింది. బైరాగీలు, బంజారాలు, సాధువులు చేస్తున్న ఆరోపణలే ఇందుకు అద్దంపడుతున్నాయి. ఉన్నతాశయంతో అప్పటి మహంతులు నిర్మించిన హథీరాంజీ మఠం వివాదాలకు నిలయంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మఠాలపై జోక్యం చేసుకోకపోవడంపై ఇలా జరుగుతుందా! ఆధ్మాత్మిక చింతనకు నిలయాలుగా ఉన్న మఠాల జోలికి పోవడం ఎంతవరకు సమంజసం అనే భావన పాలకులకు కలిగిందా.. అంటే అర్థంకాలేని పరిస్థితి నెలకొంది. 
 
ఒకప్పుడు తిరుమల తిరుపతిలోని హథీరాంజీ మఠాలకు సాధువులు, బంగారాలు, బైరాగీలు క్యూకట్టేవారు. ప్రస్తుతం ఆ జాడే కనబడటం లేదు. మహంతుల నిరంకుశత్వవైఖరి వల్లే ఇలా జరుగుతుందంటే అవునని అంటున్నారు. తాజా పరిస్థితులు అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో అన్న చందంగా ప్రస్తుత మఠాల వ్యవహరించడం వల్లే వారు మఠాలకు దూరం అవుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మఠాలలో నిత్యం నిషేధిత కార్యక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
మఠం ఆధీనంలో ఉన్న వేల ఎకరాలు అన్యాక్రాంతమైనా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఇప్పటి మహంతు వల్ల ఇలా జరుగుతుందని ప్రజల భావన. మఠం కోర్టుమెట్లెక్కే వరకూ పరిస్థితులు దారితీస్తున్నాయంటే అక్కడ జరుగుతున్న తంతు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మఠం ఆధీనంలో ఉన్న ఆలయాలలో ఉన్న వాటిని కూడా వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ ధార్మికతను దెబ్బతీస్తున్నారని సాధువులు ఆరోపిస్తున్నారు. ఇలాజరగడంతో హథీరాంజీ ఆశయం నీరుగారిపోతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.
 
ఈ నేపథ్యంలో మఠాల్లో జరుగుతున్న పరిస్థితులపై ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్పనిసరి అనిపిస్తుంది. మఠాధిపతులు తీరును మార్చి పవిత్ర దేవాలయాలుగా ఉన్న మఠాలకు పూర్వవైభవం తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.