శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2016 (11:10 IST)

తిరుమలలో ఉద్యోగుల పేరుతో నకిలీ లడ్డూ స్లిప్పులు - దళారుల కొత్త మోసం

తిరుమలలో దళారుల మోసాలకు కొదవ లేదు. కొండపైన తిష్టవేసిన కొందరు డబ్బులు సంపాందించడం కోసం రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. లడ్డూలు, గదులు అధిక ధరలకు విక్రయించడం, దర్శనాలు చేయిస్తామని డబ్బులు తీసుకోవడం ఇవన్

తిరుమలలో దళారుల మోసాలకు కొదవ లేదు. కొండపైన తిష్టవేసిన కొందరు డబ్బులు సంపాందించడం కోసం రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. లడ్డూలు, గదులు అధిక ధరలకు విక్రయించడం, దర్శనాలు చేయిస్తామని డబ్బులు తీసుకోవడం ఇవన్నీ ఇప్పటిదాకా అందరికీ తెలిసిన మోసాలు. తాజాగా కొత్త పద్దతి కనిపెట్టారు. ఇటీవల విజిలెన్స్ దృష్టికి వచ్చిన ఈ తాజా మోసం గురించి...
 
కొందరు యువకులు తిరుమలలో ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. లడ్డూలు దొరకలేదని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక వ్యక్తి కల్పించుకున్నారు. తాను తితిదే ఉద్యోగినని, తాము స్లిప్పులు ఇస్తే ఆలయం వద్ద లడ్డూలు ఇస్తారని వారికి వివరించారు. తనవద్ద ఉన్న స్లిప్పును తీసి వారి చేతిలో పెట్టాడు. ఈ స్లిప్పు తీసుకెళ్ళి ఎక్కడ, ఏ విధంగా లడ్డూలు తీసుకోవాలో కూడా సవివరంగా వివరించారు. 
 
ఒక్కో లడ్డూకు రూ.25 వంతున అందులో ఎన్ని లడ్డూలు రాసి ఉంటే అన్ని లడ్డూలకు డబ్బులు బస్సులోనే ఇచ్చేశారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి బస్సు దిగి వెళ్ళిపోయారు. అదృష్టం తమను వెతుక్కుంటూ వచ్చిందని సంతోషించిన భక్తులు లడ్డూలు తీసుకునేందుకు ఆలయం ముందుకు వెళ్ళారు. స్లిప్పును ఏదో విధంగా లోపలికి పంపించారు. ఆ తర్వాత వారికి తెలిసింది. తాము మోసపోయామని. 
 
సాధారణంగా ఉద్యోగులు తమకు లడ్డూలు అవసరమైనప్పుడు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలకు ప్రత్యేక స్లిప్పులపై రాసుకుని డిప్యూటీ ఈఓ చేతనో, లడ్డూలు మంజూరు చేసే అధికారమున్న మరో అధికారితోనే సంతకం చేయించుకుంటారు. ఆ స్లిప్పుపై ఉద్యోగి గుర్తింపు కార్డు నెంబర్‌, సెల్‌ఫోన్‌ నెంబర్‌ కూడా వేయాలి. ఆ స్లిప్పు తీసుకుని ఆలయం లోపలున్న వగపడికి వెళ్ళి లడ్డూలు తెచ్చుకుంటారు. అలాంటి స్లిప్పునే ఆ మోసగాడు భక్తులకు ఇచ్చాడు. అయితే అందులో ఉన్న గుర్తింపు కార్డు నెంబర్‌, ఫోన్‌ నెంబర్‌ అన్నీ నకిలేవని తేలింది. తాము మోసపోయామని విజిలెన్స్ అధికారులు దృష్టికి తీసుకెళ్ళారు. అయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి వారు ఇష్టపడలేదు. అలా చేస్తే భవిష్యత్తులో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం వారిలో ఉండవచ్చు. 
 
ఇలాంటి మోసగాళ్ళను కట్టడి చేయడానికి తితిదే మరింత నిఘా పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. కొందరు అదేపనిగా రోజూ తిరుమలకు వచ్చేవారున్నారు. వీరెవరూ ఉద్యోగులూ కాదు. ఇక్కడ షాపుల్లోనే, మరోచోటే పనిచేసేవారు కాదు. దళారీ పనులు చేయడం కోసమే వస్తుంటారు. ఇలాంటివారిని పట్టుకోవడం పెద్ద సమస్య కాదు. రోజూ వచ్చేవారిని గుర్తించి తిరుమలకు ఏ పనిమీద వెళుతున్నారు. ఎక్కడ పనిచేస్తున్నారు. గుర్తింపు కార్డు ఉందా? తదితర ప్రశ్నలు రాబట్టగలిగితే దళారుల గుట్టు మొత్తం విజిలెన్స్ చేతికి వస్తుంది. అదేవిధంగా రోజూ వారి తిరుమలకు వచ్చేవారి కదలికపై నిఘా ఉంచాలి. ఎక్కడికి వెళుతున్నారు. ఏమి చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. అప్పుడు దళారులను ఏరిపారేయడం తేలిక అవుతుంది. తిరుమలలో ఒకసారి భక్తులను మోసం చేస్తూ పట్టుబడిన వారి ఫోటోలను అక్కడక్కడ ప్రదర్శించడం ద్వారానూ వారికి అడ్డుకట్ట వేయడానికి అవకాశముంది. ఇటీవల ఈఓ సాంబశివరావు కూడా అధికారులను ఇలాంటి సూచనే చేశారు.
 
భక్తులూ కూడా కాస్త విజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తమంతట తాముగా వచ్చి చేస్తామని చెబితే అందులో ఏదో మతలబు ఉందని గ్రహించాలి. ఏదో ప్రయోజనం ఆశించి లేక మోసం చేయాలన్న తలంపుతో ఉన్నాడన్న విషయం అర్థం చేసుకోవాలి. దళారులుగా అనుమానించిన వారి సమాచారాన్ని విజిలెన్స్, తితిదే అధికారులకు చేరవేయడం సులభంగా మారింది. తితిదేలో టోల్‌ఫ్రీ నెంబర్లతో పాటు వాట్సాప్‌ నెంబరూ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. వాటిని భక్తులూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.