బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (09:51 IST)

శ్రీకృష్ణుడు గీతాబోధన చేస్తే.. ఆ నలుగురు విన్నారట.. కానీ సూర్యుడికే ముందు..?

భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివర “శ్రీ మద్భగవద్గీతా నూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, శ్రీ కృష్ణార్జున సంవాదే” అన్న పంక్తులుంటాయి. ఉపనిషత్తుల, బ్రహ్మవిద్య, యోగశాస్త్రాల సమిష్టి రూపమే గీత. భగవద్గీత

భగవద్గీతలో ప్రతి అధ్యాయం చివర “శ్రీ మద్భగవద్గీతా నూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే, శ్రీ కృష్ణార్జున సంవాదే” అన్న పంక్తులుంటాయి. ఉపనిషత్తుల, బ్రహ్మవిద్య, యోగశాస్త్రాల సమిష్టి రూపమే గీత. భగవద్గీత భగవంతుడు కేవలం అర్జునునికి మనోవేదన తీర్చడానికి చెప్పినది కాదు. మనిషిలోని అంతర్మధనాన్ని దూరం చేసి అతనిని కర్తవ్యముఖుడుని చేయడానికి చెప్పిన ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత.
 
గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః - యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిఃసృతా - గీత శ్రీపద్మనాభుడైన విష్ణుభగవానుని ముఖారవిందము నుండి వెల్వడిందని వ్యాసుడు భగవద్గీతను వర్ణించాడు. ‘గీతాబోధన’ ద్వాపర యుగాంతంలో, కలియుగ ప్రారంభానికి ముందు సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాల ముందు జరిగింది. ఇది జరిగి సుమారు ఆరువేల సంవత్సరాలు కావస్తోంది. ఈ గీతా మహాత్మ్యాన్ని శివుడు పార్వతీదేవికి, విష్ణువు లక్ష్మీదేవికి చెప్పారు. 
 
శ్రీకృష్ణుడు గీతాబోధన చేయగా అర్జునుడు, వ్యాస, సంజయుడు ఇంకా రథం ధ్వజంపైనున్న ఆంజనేయుడు ప్రత్యక్షంగా విన్నారు. కానీ, గీతా యోగం ఒకర్నించి మరొకరికి అందుతూ వచ్చిందని స్వయంగా భగవంతుడే గీతలోని 4వ అధ్యాయంలో మొదటి 3శ్లోకాలలో చెప్పాడు.
 
భగవద్గీత మొదట సూర్యదేవునికి చెప్పబడింది. సూర్యుడు దానిని మహర్షి మనువుకు వివరించగా, దానిని అతడు ఇక్ష్వాకునికి అందజేసాడని ''ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహ మవ్యయమ్" అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది. భగవద్గీత విశిష్టతను భగవానుడే స్వయంగా 18వ అధ్యాయము 68వ శ్లోకం నుండి 71 వరకు తెలిపాడు. పరమసిద్ధిప్రాప్తికై రెండు ముఖ్య మార్గాలైన సాంఖ్య యోగము, కర్మ యోగములను భగవంతుడు గీతలో ఉపదేశించాడు.
 
భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క యోగము అంటారు. 1 నుండి 6వ అధ్యాయాలను కలిపి ‘కర్మషట్కము’, 7 నుండి 12 వరకు ‘భక్తి షట్కము’ ఇక 13నుండి 18 వరకు ‘జ్ఞాన షట్కము’ అంటారు.