గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By venu
Last Modified: బుధవారం, 24 మే 2017 (18:31 IST)

మనిషికి ఏడుగురు తల్లులు... ఎవరువారు?

విశ్వంలో జనించిన ప్రతి మనిషికీ ఏడుగురు తల్లులు ఉంటారని, వారికి ఏ హానీ కలిగించకుండా సదా సేవించాలని శ్రీ ప్రభుపాదులవారు చెప్పారు. గత జన్మల పాపపంకిలం నుండి విముక్తి కలిగిస్తూ మన భౌతిక శరీరానికి జన్మనిచ్చి, తన స్తన్యమిచ్చి పెంచి పెద్దచేసే కన్నతల్లి మొదటి

విశ్వంలో జనించిన ప్రతి మనిషికీ ఏడుగురు తల్లులు ఉంటారని, వారికి ఏ హానీ కలిగించకుండా సదా సేవించాలని శ్రీ ప్రభుపాదులవారు చెప్పారు. గత జన్మల పాపపంకిలం నుండి విముక్తి కలిగిస్తూ మన భౌతిక శరీరానికి జన్మనిచ్చి, తన స్తన్యమిచ్చి పెంచి పెద్దచేసే కన్నతల్లి మొదటి తల్లి. ఆమెని మనం ఆదిమాతగా కొలవాలి. రెండవ తల్లి గురువు భార్య. మనకు విద్యాబుద్ధులు నేర్పి, సంఘంలో ఓ స్థానం కల్పించేలా మనల్ని రూపుదిద్దే దైవరూపుడైన గురువు భార్య. మూడవ తల్లి బ్రాహ్మణి. పుట్టినప్పటి నుండి మనం జరిపే ప్రతి క్రతువులోనూ మనల్ని ముందుండి నడిపి, పుణ్యఫలాలను అందుకోవడంలో అనునిత్యం సహాయం చేసే బ్రాహ్మణుని భార్య. 
 
నాల్గవ తల్లి ఆ దేశపు రాణి. దేశంలోని ప్రజలందరినీ పాలించి వారి కష్టాలను కడతేర్చి, సుఖశాంతులను అందించే రాజు యొక్క భార్య. ఐదవ తల్లి ఆవు. రకరకాల పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారాన్ని అందించి మానవాళిని శక్తివంతం చేసే గోమాత. ఆరవ తల్లి ధాత్రి. ధాత్రి అనే పదానికి సేవిక అనే అర్థం ఉంది. మంగళసూత్రం కట్టిన భార్య, కడుపున పుట్టిన బిడ్డలు సైతం చీదరించుకోగల వ్రణాలను, గాయాలను సైతం శుభ్రపరిచి, ఔషధ లేపనాలు, సముచిత సేవలతో తిరిగి ఆరోగ్యాన్ని సమకూర్చే సేవిక (నర్సు). ఇక చివరిగా ఏడవ తల్లి భూమాత. అనుక్షణం వ్యవసాయం పేరుతో దున్ని హింసించినా, మన పాదఘట్టనలతో పరుగులెట్టి గాయపరిచినా క్షణమైనా అలుపెరుగక, నిరంతరం సూర్యుని చుట్టూ తిరుగుతూ కేవలం మానవాళికే కాక, సకల ప్రాణికోటికి జీవాన్ని అందించే నేలతల్లి. 
 
ఈ ఏడుగురు తల్లులు సదా పూజ్యనీయులని, వీరిని సేవించే వారికి భగవంతుడు సర్వపుణ్యలోకాలను సంప్రాప్తింపజేస్తాడని ఇస్కాన్‌ను ప్రారంభించి, కృష్ణ భగవానుని సేవలో తరించి, 1977లో ఆ దేవదేవుని సన్నిధానానికి పయనమైన అభయ్ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాదులవారు ఉపదేశమిచ్చారు.