గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 29 అక్టోబరు 2018 (21:05 IST)

శ్రీవారికి ఆ అలంకారమంటే చాలా ఇష్టమట..?

నిత్యం భక్తకోటికి దర్సనమిచ్చే వేంకటేశ్వరుడికి శ్రీ గంధం అలంకారమంటే మహాప్రీతి. ఆ స్వామితో శ్రీ గంధం ప్రత్యేక అనుబంధం. ఇక ఆలయాల పూజా కైంకర్యాల్లో సుగంధ సువాసనలు వెదజల్లే ఔషధ గుణాలున్న శ్రీ గంధం వాడకంతో ఆ ప్రాంతమంతా క్రిమికీటకాలు రాకుండా ఉంటుంది. అంతటి పవిత్రమైన ఔషధ గుణాలున్న శ్రీ గంధాన్ని భవిష్యత్ అవసరాల కోసం టిటిడి తిరుమల పుణ్యక్షేత్రంలోనే సొంతంగా సాగు చేస్తోంది.
 
కైంకర్యాలతో కూడిన అలంకారమంటే ఆ స్వామికి మహా ఇష్టం. యేటా సుమారు 450 రకాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ పూజా కైంకర్యాల్లో శ్రీ గంధం వాడకం సంప్రదాయం. సుగంధ సువాసనలు వెదజల్లే శ్రీ గంధం లేపనాన్ని ధృవమూర్తి, ఉత్సవమూర్తుల అభిషేకం, స్నపన తిరుమంజనం సందర్భంగా సమర్పిస్తుంటారు. అనేక పూజలు, సేవల్లోనూ శ్రీ గంధాన్ని విరివిగా వాడుతుంటారని శ్రీవారి ఆలయ అర్చకులు చెబుతున్నారు.
 
తిరుమల పుణ్యక్షేత్రంలో భాగమైన శేషాచలం తూర్పు కనుమల్లో ఉంది. 5.5హెక్టార్లు అంటే సుమారుగా 4756 చదరపు కిలోమీట్ల విస్తీర్ణంలో చిత్తూరు, కడపజిల్లాలలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ శేషాచలంలో మొత్తం 1450 మొక్కలున్నాయి. ఇందులో 1300 మొక్కల్లో అపారమైన ఔషధ సుగంధ గుణాలున్నాయి. అందులో శ్రీ గంధం కూడా ప్రముఖమైనది. 
 
శ్రీవారి పూజా కైంకర్యాలకు అవసరమైన శ్రీ గంధం టిటిడి అవసరాలు, నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా లభిస్తున్నాయి. తిరుమలలో ఆరుకోట్ల రూపాయలతో తిరుమలలో ముఫ్పై ఎకరాల్లో పదహారు వేల మొక్కలతో వనం ప్రారంభించారు. అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. దీనికి వంద హెక్టార్లు అంటే 250 ఎకరాలను విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ విస్తరణ పనులు దశలవారీగా సాగిస్తోంది. ఇలా తిరుమలలో శ్రీగంధంను పండించి శ్రీవారి కైంకర్యాలకు వీటిని వినియోగిస్తున్నారు.