శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : బుధవారం, 20 జులై 2016 (11:54 IST)

గోవిందరాజస్వామి గుడిలో గోవిందులు.... హుండీ సొమ్ము స్వాహాయ నమః

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం.. ఈ పేరంటే తెలియని వారుండరు. సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్నకు అన్నగా ప్రసిద్ధి చెందారాయన.

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం.. ఈ పేరంటే తెలియని వారుండరు. సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్నకు అన్నగా ప్రసిద్ధి చెందారాయన. తిరుపతికి వచ్చే భక్తులో 25 శాతంకుపైగా భక్తులు గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం ఎప్పటి నుండో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంది. తితిదేకి చెందిన రెగ్యులర్‌ ఉద్యోగస్తులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతోమంది ఈ ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. స్వామివారి రాబడికే ఈ ఉద్యోగులు కన్నం వేసేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు భక్తుల నుంచి వేలకు వేల రూపాయలు అక్రమ మార్గంలో సంపాందించేస్తూ స్వామికే పంగనామాలు పెట్టేస్తున్నారు. గోవిందరాజస్వామి ఆలయ ఉద్యోగస్తులపై ప్రత్యేక కథనం....
 
చిత్తూరుజిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో గోవిందరాజస్వామి ఆలయం ఒకటి. నిత్యం 10 నుంచి 15వేలమంది భక్తులు ఆలయానికి వస్తూ పోతుంటారు. ఆలయంలో పనిచేసే అర్చకుల నుంచి సిబ్బంది వరకు కొంతమంది అక్రమ మార్గంలో డబ్బు సంపాందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు 2 నుంచి 5 వేల రూపాయల వరకు అక్రమంగా వీరు డబ్బులు సంపాందిస్తున్నారన్న ఆరోపణలంటారు.. అదెలాగంటారా...
 
బయటి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను ఆలయం వెలుపలే కొంతమంది బ్రోకర్లు మాట్లాడి ఆలయంలోపలికి పంపుతారు. ఆలయంలోపలికి పంపేముందే తితిదే సిబ్బందితో మాట్లాడేసుకుంటారు. బ్రోకర్‌ ఒక రేటు, తితిదే సిబ్బందికి మరో రేటు ఉంటుంది. ఆలయంలోపలికి తీసుకొని వెళ్ళిందే దగ్గరుండి మరీ దర్శనం చేయించి తీర్థప్రసాదాలు ఇచ్చి పంపుతారు. ఒకవేళ భక్తుడు హుండీలో డబ్బులు వేస్తుంటే వాటిని వేయద్దంటూ కొంతమంది తితిదే సిబ్బంది చెబుతారు. హుండీ డబ్బులు కాస్త మాకు ముట్టజెబితే కాస్త పుణ్యముంటుందని చెబుతున్నారు. 
 
ఆలయంలోపల స్వామివారి ముందు ఉండే కొంతమంది ఉద్యోగస్తులు సామాన్య భక్తుల నుంచి 50 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేసి అక్కడే కొంతసేపు వారిని నిలబెడుతున్నారు. అర్చకులకు ఇందులో వాటాలు లేకపోలేదు. అర్చన టికెట్‌ 10 రూపాయలు వసూలు చేస్తుంటే ఆ టికెట్‌ కొనకపోయినా అర్చకుడు మాత్రం ఉచితం అర్చన చేసేస్తారు. కారణం డబ్బులు తితిదే ఖజానాకు కాకుండా నేరుగా ఆయన చేతికే వస్తుంది కాబట్టి. ఇలా తితిదే ఖజానాతో పాటు స్వామివారి హుండీ ఆదాయానికే గండికొడుతున్నారు తితిదే సిబ్బంది.
 
ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఇందులో కొంతమంది కాంట్రాక్టు కార్మికులు లేకపోలేదు. మహారాష్ట్ర, బెంగుళూరుకు చెందిన భక్తులెవరైనా వస్తే వెంటనే ఈ కాంట్రాక్టు ఉద్యోగులు కూడా బేరసారాలు చేస్తారు. ఒకవైపు బ్రోకర్లు, లేకుంటే కాంట్రాక్టు వర్కర్లు. ఇలా వీరి వ్యాపారం మూడుపువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఎవరెటు పోయినా పర్మినెంట్‌ ఉద్యోగులు వీరి పేరుతో బాగానే సంపాందించేస్తున్నారు. ఇదే విషయంపై గతంలో ఎన్నోసార్లు భక్తులు తితిదే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. అయినా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇప్పటికైనా తితిదే ఈఓ సాంబశివరావు  దీనిపై స్పందించాలని భక్తులు కోరుతున్నారు.