మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సందీప్ రేవిళ్ల
Last Modified: బుధవారం, 20 మార్చి 2019 (16:02 IST)

దేవాలయంలో ముందుగా శివుడిని దర్శించుకోవాలా? నవగ్రహాలనా?

జీవితంలో సమస్యలు ఎదుర్కొంటుంటే కొందరు జ్యోతిష్యులు గ్రహదోషాలు ఉన్నాయని, వెంటనే పూజ చేయించాలని చెబుతారు. మన హిందూ ధర్మం ప్రకారం 9 గ్రహాలు ఉన్నాయి. వాటినే నవగ్రహాలు అంటారు. అవి బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు. వీటి స్థితిలో మార్పులను ఆధారంగా చేసుకుని మనకు జ్యోతిష్యులు జాతకాలు చెబుతారు. నవగ్రహాలు ప్రధానంగా శివాలయాల్లో కనిపిస్తాయి. 
 
నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటారు. వీరిని నియమించింది శివుడే. అదేవిధంగా గ్రహాలకు మూలమైన సూర్యదేవుడికి అధిదేవత కూడా శివుడే. ఈ కారణం చేతనే గ్రహాలన్నీ శివుని అనుజ్ఞానుసారం సంచరిస్తాయి. శివుని ఆలయాల్లో నవగ్రహాలు ఎక్కువగా దర్శనమివ్వడానికి కారణం ఇదే. ఆదిదేవుడైన శివున్ని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలు దరిచేరవని ప్రతీతి. శివాలయాల్లో నవగ్రహాలకు పూజ చేసినా చేయకపోయినా శివునికి మాత్రం చాలా మంది అభిషేకం లేదా అర్చన చేయిస్తారు. 
 
మనకు ఇతర దేవాలయాల్లో కూడా నవగ్రహ మంటపాలు కనిపిస్తుంటాయి. వాటిని దర్శించినప్పుడు ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే ఆలయానికి వెళ్లినప్పుడు ముందుగా నవగ్రహాలను దర్శించాలా లేక శివున్ని దర్శించుకోవాలా. శివుడు ఆదిదేవుడు, కర్తవ్యాన్ని బోధిస్తాడు కాబట్టి ముందుగా పరమేశ్వరుడిని దర్శించుకుంటే మంచిది. నవగ్రహాలను దర్శించుకున్నా ఎలాంటి దోషం ఉండదు. ముందుగా శివున్ని దర్శించుకుంటే తమ స్వామిని దర్శించుకున్నందుకు నవగ్రహాలు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి.