19న జనవరి కోటా శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్
శ్రీవారి అర్జిత సేవల్లో భాగంగా, జనవరి కోటా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవల కోటా టిక్కెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లు ఈ నెల 19వ తేదీ ఉదయం పది గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లను పొందినవారు ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను ఈ నెల 23వ తేదీ ఉదయం పది గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా కూడా 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లను కోటాను 24వ తేదీ ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను కోటాను 25వ ఉదంయ 10 గంటలకు విడుదల చేయనున్నారు.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి అర్జిత దర్శన టిక్కెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.