శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (11:25 IST)

నవంబర్ 1 నుంచి తిరుమల కొండలో ప్లాస్టిక్‌పై నిషేధం.. రూ.25 వేల జరిమానా

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలపై ఇక ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదు. స్వచ్ఛ తిరుమల లక్ష్యాన్ని సాధించేందుకు టీటీడీ అధికారులు ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధించారు. గురువారం నుంచి తిరుమల కొండపై ఎవరూ ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించరాదు.


షాపుల యజమానులు కవర్లలో పెట్టి వస్తువులు అందించకూడదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, అతిక్రమిస్తే రూ.25 వేల రూపాయలు జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.
 
తొలిసారి జరిమానాతో సరిపెడతామని, రెండోసారి తప్పుచేస్తే షాపు లైసెన్స్‌ రద్దు చేస్తామని టీటీడీ అధికారులు తేల్చి చెప్పేశారు. తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేసేలా వారిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

అలాగే భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించేందుకు అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఈఓ’ కార్యకమ్రం నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య భక్తులు 0877-2263261 నంబర్‌కు ఫోన్‌ చేసి ఈఓతో మాట్లాడవచ్చు. 
 
మరోవైపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుక్రవారం విడుదల చేయనుంది. 2019, ఫిబ్రవరిలో స్వామివారి సేవల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ టికెట్లను ఆలయ వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను లక్కీడిప్‌ విధానంలో జారీ చేయనున్నారు.
 
అలాగే విశేషపూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కరెంటు బుకింగ్‌ కింద వెంటనే నమోదు చేసుకోవచ్చు. అన్ని రకాల సేవలను కలిపి దాదాపు 50,000 వరకూ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.