శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (15:02 IST)

శ్రీరామనవమి.. భద్రాద్రిలో.. అట్టహాసంగా జరిగిన కల్యాణోత్సవం

చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఇదే రోజున సీతాదేవితో ఆయన వివాహం జరిగింది. త్రేతాయుగంలో జరిగిన ఈ ఘటనను తలచుకుంటూ నేటికీ ఊరూరా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ, పూజిస్తుంటాం. అయితే ఈసారి శ్రీరామనవమి విషయంలో నవమి ఘడియలు చర్చనీయాంశమైనాయి. 
 
శనివారం అత్యధిక సమయంపాటు నవమి ఘడియలు ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో స్వామివారి కల్యాణోత్సవాలను జరిపించడం జరిగింది. అయితే, భద్రచాలంలో మాత్రం ఆదివారం కల్యాణం జరిగింది. 
 
అష్టమితో కలిసివచ్చే నవమి ఘడియల్లో స్వామికి, అమ్మవార్లకు కల్యాణం జరిపించే ఆనవాయతీ లేదని, నిన్న ఉదయం వరకూ అష్టమి ఘడియలు ఉన్నందున ఆదివారం జరిపిస్తున్నామని భద్రాచలం అధికారులు స్పష్టం చేశారు. దశమి ఎంతో మంచి రోజని, అష్టమి సూర్యోదయానికి ముందే వెళ్లిపోతే మాత్రమే ఆ రోజున కల్యాణం జరిపించాలే తప్ప, సూర్యోదయం తరువాత అష్టమి ఉంటే అదే రోజున స్వామివారి వివాహ మహోత్సవాన్ని నిర్వహించరాదని తెలిపారు.
 
ఈ నేపథ్యంలో లోక కల్యాణంగా భావించే రాములోరి కల్యాణం భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగింది. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లఘ్నమందు సీతారాముల కల్యాణ వేడుకను నిర్వహించారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాన్ని నిర్వహించారు. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరించారు.
 
తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు స్వామి, అమ్మవారికి సమర్పించారు. సీతారాముల కల్యాణ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భద్రాద్రి ఆలయం కిటకిట లాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు.