శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (09:48 IST)

తితిదేలో పెరుగుతున్న కరోనా కేసులు - పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా 2,432 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 224 కేసులు నమోదయ్యాయి. వీటిలో తిరుపతిలోనే 135 కేసులు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలను తీసుకుంది. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో కోవిడ్ సేవలను అందించాలని నిర్ణయించింది. దీంతోపాటు భక్తులకు వసతి కల్పించే విష్ణు నివాసాన్ని కూడా కోవిడ్ సెంటర్‌గా మార్చేందుకు ఆమోదం తెలిపింది.
 
ఇదిలావుంటే, శ్రీవారి హుండీ ఆదాయం క్రమంగా పెరుగుతోంది. లాక్డౌన్ తర్వాత పరిమితంగా భక్తులకు దర్శనాలను అనుమతిస్తున్న వేళ, తిరుమలలో బుధవారం రద్దీ పెరిగింది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న వారు కూడా కరోనా భయంతో స్వామి దర్శనానికి వచ్చేందుకు సుముఖంగా లేరనే వార్తలు వచ్చాయి. 
 
కానీ, బుధవారం ఏకంగా 8,068 భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. మొత్తం 2,730 మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు. లాక్డౌన్ అనంతరం దర్శనాలను పునరుద్ధరించిన తర్వాత రూ.32 లక్షల హుండీ ఆదాయం వచ్చిందని తితిదే అధికారులు వివరించారు.