బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (13:19 IST)

వైవీ సుబ్బారెడ్డి సంచలనం : శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు?

తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం అమలు చేస్తున్న వీఐపీ బ్రేక్ దర్శన విధానాన్ని రద్దు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో తితిదే కొత్త పాలక మండలి తొలి సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 
 
శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించాల్సివుందని గతంలో పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని చెప్పిన ఆయన, త్వరలో ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిగా ఏర్పడిన తర్వాత తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
తితిదే కొత్త ఛైర్మన్ ఆలోచన మేరకు.. ఈ విధానం అమల్లోకి వచ్చినట్టయితే అన్ని బ్రేక్ దర్శనం టికెట్లకూ సమానంగా స్వామి దర్శనం లభిస్తుంది. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనం టికెట్లను మూడు కేటగిరీల్లో విభజిస్తున్నారు. స్థాయిని బట్టి వీటిని మంజూరు చేస్తున్నారు. వీరిలో ఎల్1 టికెట్ ఉంటే, ఒత్తిడి లేకుండా స్వామివారి దర్శనం (అత్యంత ప్రముఖులకు), ఆపై తీర్థం, శఠారీ మర్యాదలు అందిస్తున్నారు. 
 
అలాగే, ఎల్2 టికెట్ ఉంటే, గర్భగుడి ముందు ద్వారమైన కులశేఖరపడి వరకు స్వామి వారిని దర్శించుకుంటూ వేగంగా వెళ్లాలి. ఇక ఎల్3 ఉంటే, మరింత వేగంగా కదిలేలా కూలైన్లను పర్యవేక్షిస్తూ, దర్శనం కల్పిస్తున్నారు. దీనిపై ఎంతోకాలంగా విమర్శలు వస్తుండటంతోనే విధానాన్ని మార్చాలని వైవీ భావిస్తున్నట్టు సమాచారం.