శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. పుణ్య క్షేత్రాలు
Written By chj
Last Modified: సోమవారం, 26 డిశెంబరు 2016 (20:31 IST)

బట్టలు ఉతకడం ఆపి నా గుడి కట్టమన్న అష్టముఖ పశుపతినాథుడు

పశుపతినాథ్ దేవాలయం అనగానే మనకు నేపాల్ లోని కఠ్మాండూ నగరమే ముందుగా గుర్తుకొస్తుంది. అయితే, మన దేశంలోనే శివ్నానది ఒడ్డున కొలువుదీరిన పశుపతినాథుడు ఎన్నో ప్రత్యేకతలు కలవాడుగా పేరు పొందాడు. శివ్నానది మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని మంద్ సౌర్ పట్టణంలో ఉంది. ఈ నద

పశుపతినాథ్ దేవాలయం అనగానే మనకు నేపాల్ లోని కఠ్మాండూ నగరమే ముందుగా గుర్తుకొస్తుంది. అయితే, మన దేశంలోనే శివ్నానది ఒడ్డున కొలువుదీరిన పశుపతినాథుడు ఎన్నో ప్రత్యేకతలు కలవాడుగా పేరు పొందాడు. శివ్నానది మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని మంద్ సౌర్ పట్టణంలో ఉంది. ఈ నదీ తీరంలో ప్రపంచంలో మరెక్కడా లేని మూర్తిగా అష్టముఖాలతో ఈశ్వరుడు భక్తకోటిచే పూజలు అందుకుంటున్నాడు. శివ్నానది గలగలలతో పశుపతినాథుడుని కీర్తించే భజనలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు అసలు సిసలైన చిరునామగా నిలుస్తుంది. ఈ స్వామి స్వయంభువుడు. 
 
500 ఏళ్ల క్రిందట శివ్నానది వడ్డుగల పెద్ద బండరాయి వద్దకు ఒక రజకుడు రోజూ బట్టలు ఉతుక్కోవడానికి వెళుతుండేవాడట. ఒక రోజు అతనికి శివుడు కలలో కనిపించి ఆ చోట బట్టలు ఉతకడం మానేసి అక్కడ తనను వెలికి తీసి గుడి కట్టమని ఆ మూర్తిని  దర్శించుకొన్నవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని తెలియజేసాడట. మరునాడు ఆ రజకుడు తనతోటి వారితో వెళ్ళి, అక్కడ తవ్విచూడగా స్వామి విగ్రహం కనిపించింది. దాంతో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారట. ఈ స్వామి వేల ఏళ్లక్రితమే ఇక్కడ వెలిసినా 1940 వేసవి వరకు శివ్నానది నీటిలో మునిగే ఉన్నాడు పశుపతినాథుడు. నది నీటమట్టం తగ్గడంతో భక్తులకు పూర్తి రూపంతో 1961లో దర్శనం ఇచ్చాడు. 
 
ఆ మరుసటి యేడు అత్యంత ఘనంగా స్వామి ఆలయ పునరుద్దరణ జరిగింది. ఆ తరువాత పార్వతి, గణేశ, కార్తికేయ, గంగ, విష్ణు, లక్ష్మి, ఆదిశంకరాచార్య మూర్తులను ప్రతిష్టించారు. ఇక్కడ స్వామిని అందరూ చేత్తో స్పర్శించవచ్చు. మహాశివరాత్రికి రుద్రాభిషేకం బిల్వపత్రాలతో పూజలు జరుపుతారు. మంద్ సౌర్ పట్టణంలోని శివ్నానదికి 90 అడుగుల ఎత్తులో, 30 అడుగుల విస్తీర్ణంలో 101 అడుగుల పొడవుతో పశుపతినాథ్ దేవాలయం అత్యంత నయనానందకరంగా భాసిల్లుతుంది. దేవాలయంపైన 100 కిలోల స్వర్ణంతో చేసిన గోపుర భాగం సూర్యకిరణాల కాంతితో మెరుస్తూ భక్తులను అలౌకికమైన ఆనందానికి చేరువ చేస్తుంది. ఎక్కడాలేని విధంగా ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు మహాద్వారాలు ఆశ్చర్యపరుస్తాయి. భక్తులంతా పశ్చిమ మహాద్వారం ద్వారానే లోపలికి వెళతారు. 
 
ముందుగా అతిపెద్ద నంది దర్శనమిస్తుంది. నంది ఆశీస్సులు తీసుకొని గర్భాలయంలో అడుగు పెట్టగానే వర్ణించనలవి కానంత అద్భుతంగా స్వామి మూర్తి దర్శనమిస్తుంది. 3.5 మీటర్ల ఎత్తులో శివలింగం పై భాగం నాలుగు ముఖాలు క్రింది భాగంలో నాలుగు ముఖాలు మొత్తం 8 ముఖాలతో ఉన్న స్వామి మూర్తి ప్రకాశవంతమైన నల్లని అగ్నిశిల. ఈ ముఖాలలో రుద్ర మూర్తిగా దర్శనమిచ్చే ముఖం మాత్రం ద్వారానికి ఎదురుగా ఉంటుంది. తల కట్టుకు పాములతో ముడివేసినట్లుగా ఉంటుంది. నాలుగు తలలు పైన ఉండే లింగం మీద ఓంకారం దర్శనమిస్తుంది. భవ, పశుపతి, మహాదేవ, ఈశాన, రుద్ర, వర్వ, అశని, రూపాల ముఖాలతో స్వామి భక్తులచే పూజలు అందుకోవడం అక్కడ ప్రత్యేకత. ఈ స్వామి బరువు 4665 కిలోలని, స్వర్ణయుగంగా భాసిల్లే గుప్తుల కాలంలో స్వామి ప్రతిష్ట, ఆలయ నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడ ఆధారాలు ద్వారా తేలుస్తుంది. ఇక్కడ స్వామికి జలమే జలాభిషేకం చేయడం ఇక్కడ అరుదైన ఘటన. 
 
ప్రతి వర్షాకాలం శివ్నానది 90 అడుగులు ఉప్పొంగి ఆ నది శివలింగం అగ్ర భాగాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని దూరం నుంచే వేలాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యానికి పులకించి పోతుంది.