గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. పుణ్య క్షేత్రాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 14 జులై 2017 (20:31 IST)

అబద్ధాలు చెప్పినవాళ్లను వదలడు ఆ గుడిలో దేవుడు... ఏ దేవుడు?

పాపాలు హరించే దేవుడు ఆయన. ఆయనే కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. చిత్తూరు జిల్లాకు 12 కి.మీ దూరలోని బహుదా నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం. ఈ ఆలయంలోని వినాయకుడిని స్థానికుడు, ప్రమాణాల దేవుడని పిలుస్తారు. నేరాలు చేసి, ఇచ్చినమాట

పాపాలు హరించే దేవుడు ఆయన. ఆయనే కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. చిత్తూరు జిల్లాకు 12 కి.మీ దూరలోని బహుదా నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం. ఈ ఆలయంలోని వినాయకుడిని స్థానికుడు, ప్రమాణాల దేవుడని పిలుస్తారు. నేరాలు చేసి, ఇచ్చినమాట తప్పిన వారు ఈ ఆలయంలో మాత్రం స్వామి మహిమ చేత నిజాలే చెప్తారట. అలా చెప్పడం ద్వారా వారి పాపాలు నశించిపోతాయంటారు భక్తులు.
 
ఒకవేళ నిజాన్ని దాచి అసత్యాలు చెబితే వారిని స్వామి ఊరికే వదలడని ప్రతీతి. కాణి అంటే తడిసిన నేల అని అర్థం. పాకమ్ అంటే తడినేల లోకి నీళ్ల ధార అని అర్థం. గణనాధుడు ఈ ఆలయంలో బావి నుంచి వెలిశాడు కనుక ఆయనకు స్వయంభూ వరసిద్ధి వినాయకుడు అనే పేరు వచ్చింది. ఆయన వెలసిన బావిలోని పవిత్ర జలాన్ని భక్తులు తీర్థంలా సేవించి తరిస్తున్నారు.
 
స్థల పురాణం:
పూర్వ కాలంలో గుడ్డి, మూగ, చెవిటి అంగవైకల్యాలు కలిగిన ముగ్గురు సోదరులు కాణిపాకం ప్రాంతంలో నివసించేవారు. వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని సాగించేవారు. ఆ కాలంలో వ్యవసాయం చేసేందుకు గూడ పద్ధతి ద్వారా నీటిని తోడుకునేవారు. బావి ప్రక్కగా గొయ్యి తవ్వి ఇద్దరు మనుషులు బావి లోంచి నీటిని తోడి పోసేవారు. 
 
అంగవైకల్యం కలిగిన వీరు ముగ్గురు సోదరులు కష్టాలు పడుతూ ఇలానే జీవితం సాగిస్తున్నారు. ఒకనాడు ఆ బావి నీరు ఇంకిపోయే దశకు చేరుకుంది. దీంతో వ్యవసాయం ఎలా సాగించాలో అక్కడి వారికి అర్థం కాలేదు. ఓ రోజు ముగ్గురి సోదరుల్లో ఒకరు బావిలోకి దిగి త్రవ్వడం ప్రారంభించాడు. ఆ సమయంలో రాతి విగ్రహం లాంటిదేదో అతని పారకు తగిలింది. 
 
అది ఏమిటో చూసే లోపే అక్కడ నుంచి రక్తం రావడం ప్రారంభమయింది. నిముషాల్లోనే బావి మొత్తం రక్తంతో నిండిపోయింది. మరుక్షణమే అంగవైకల్యంతో బాధపడుతున్న ఈ ముగ్గురి లోపాలు మాయమై మామూలు మనుషులయ్యారు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు అక్కడకు చేరుకుని బావిని త్రవ్వే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. అక్కడ నుంచి స్వయంభూ వినాయకుడు ఉద్భవించాడు. అప్పట్నుంచీ స్వయంభూ వరసిద్ధి వినాయకుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు.