1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (10:27 IST)

కరోనా బారిన పడిన మిల్కాసింగ్.. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స

ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కరోనా వైరస్ బారిన పడటంతో.. మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. అయితే.. చండీగఢ్‌లోని ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండి తొలుత చికిత్స తీసుకున్న 91 ఏళ్ల మిల్కాసింగ్.. వైద్యుల సూచనల మేరకు కొద్దిరోజులకే మొహాలిలోని ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకున్న ఈ ఫ్లయింగ్ సిఖ్.. గత ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
 
ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినప్పటికీ.. వైద్యుల సూచనల మేరకు ఆక్సిజన్ సాయం తీసుకుంటూ ఉన్నాడు. కానీ.. గురువారం అనూహ్యంగా మిల్కాసింగ్ ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా కనిపించడంతో వెంటనే ఐసీయూకి తరలించిన వైద్యులు.. అక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మిల్కాసింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
 
కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మిల్కాసింగ్ అప్పట్లో గుర్తింపు పొందారు. 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో అంచనాలకి మించి రాణించిన మిల్కా సింగ్ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.