1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (16:44 IST)

మోదీతో ఒలింపిక్ హాకీ హీరోలు: ఐస్ క్రీమ్, చూర్మాతో..? (video)

ఒలింపిక్ హాకీ హీరోలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఆగస్టు 16న ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అల్పాహార విందు ఇవ్వడం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతి క్రీడాకారులను ప్రధాని మోడీ విడివిడిగా పలకరించారు.

ఒలింపిక్స్ పర్యటన మధుర అనుభవాల గురించి క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారు. ఒలింపిక్స్‌కు బయలుదేరి వెళ్లే ముందు పీవీ సింధుకు ఇచ్చిన మాట మేరకు ఆమెతో కలిసి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశారు. అలాగే ఒలింపిక్స్‌తో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాతో చూర్మా ఎంజాయ్ చేశారు. 
 
ఒలింపిక్స్ పతకం గెలిచిన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. తృటిలో పతకం చేజారిన క్రీడాకారులను ప్రోత్సహించారు. కాగా ఒలింపిక్స్ క్రీడాకారులతో ముచ్చటిస్తున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం తన ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశారు. ఐస్ క్రీమ్, చూర్మాతో పాటు మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి ఒలింపిక్ క్రీడాకారులతో ముచ్చటించినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మునుపెన్నడూ లేని స్థాయిలో ఏడు పతకాలు సాధించడం తెలిసిందే. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం సాధించారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌తో పతకాలు సాధించిన క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది.