హాకీ వరల్డ్ లీగ్ : డ్రాగా ముగిసిన దాయాదుల పోరు
బెల్జియం వేదికగా శుక్రవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన హాకీ వరల్డ్ లీగ్లో పోటీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. గోల్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ... మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లూ సమాన గోల్స్ చేశాయి. దీంతో మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో ఓటమెరుగని భారత్ గ్రూప్-ఎలో మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్లలో భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. దీంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగే మ్యాచ్పై ఉత్కంఠత నెలకొంది. కానీ, ఈ మ్యాచ్ 2-2తో డ్రా అయింది. అయితే, ఈ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిందని చెప్పాలి.
వచ్చే ఒలింపిక్స్కు ఇప్పటికే అర్హత సాధించడంతో భారత్ ఈ మ్యాచ్లో స్వేచ్ఛగా ఆడింది. అయితే రియో బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగిన పాక్ మాత్రం దూకుడుగా ఆడినప్పటికీ సర్దార్ సేనను ఓడించలేకపోయింది.
భారత ఆటగాడు రమణ్ దీప్ 13, 39వ నిమిషాల్లో రెండు ఫీల్డ్ గోల్స్ చేశాడు. మరోవైపు పాక్ కెప్టెన్ మహమ్మద్ ఇమ్రాన్ 23వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ను, 37వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్స్గా మలిచాడు. దీంతో ఇరు జట్లూ సమానంగా రెండు గోల్స్ చేసి స్కోరును పంచుకున్నాయి.