1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (08:23 IST)

బాధపడాలో - సంతోషించాలో అర్థం కావడంలేదు : పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో శనివారం జరిగిన సెమీస్ పోటీల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు ఓడిపోయింది. కానీ, మూడోస్థానం కోసం ఆదివారం జరిగిన పోరులో అద్భుతంగా ఆడి కాంస్యం సాధించింది. తద్వారా ఒలింపిక్స్ పోటీల్లో రెండో పతకం సాధించిన క్రీడాకారిణిగా సింధు సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
ఈ విజయం అనంతరం సింధు మాట్లాడుతూ, తనను మిశ్రమ భావాలు చుట్టుముడుతున్నాయన్నారు. ఒలింపిక్స్ వంటి విశ్వవేదికపై బ్యాడ్మింటన్ ఫైనల్లో ఆడే చాన్స్ కోల్పోయినందుకు బాధపడాలో, కాంస్యం నెగ్గినందుకు సంతోషించాలో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించింది. అయితే, ఈ కాంస్యం ఇన్నేళ్ల తన కష్టానికి ప్రతిఫలంగానే భావిస్తానని స్పష్టం చేసింది.
 
బింగ్జియావోతో మ్యాచ్‌కు ముందు తనలో తీవ్ర భావోద్వేగాలు కలిగాయని, అయితే, మ్యాచ్‌లో అవన్నీ పక్కనబెట్టి ఆటపైనే దృష్టి కేంద్రీకరించానని సింధు వెల్లడించింది. సర్వశక్తులు ఒడ్డి ఆడానని, దేశం కోసం పతకం సాధించింనందుకు ఆనందంగా ఉందని పేర్కొంది.
 
అన్ని సమయాల్లోనూ తన వెన్నంటే నిలిచి, తనపై ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు సదా రుణపడి ఉంటానని సింధు వినమ్రంగా తెలియజేసింది. ఈ విజయం వెనుక కుటుంబ సభ్యుల కష్టం, స్పాన్సర్ల ప్రోత్సాహం ఉందని వెల్లడించింది. మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని చైనాకు చెందిన చెన్ యుఫెయ్ ఎగరేసుకెళ్లింది.