కామన్వెల్త్ గేమ్స్ : తొలిరోజే స్వర్ణంతో బోణీ చేసిన భారత్
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో తొలిరోజే భారత్ స్వర్ణ పతకంతో బోణీ చేసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో కుము క్చమ్చాను సంజితా చాను స్వర్ణ పతకం సాధించగా, సయకొమ్ మీరాబాయ్ చాను రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
మొదటి రెండు స్థానాలను భారత్ కైవసం చేసుకోగా, కాంస్య పతకాన్ని నైజీరియాకు చెందిన కెచి ఓపరా తన ఖాతాలో చేర్చుకుంది. సంజిత మొత్తం 173 కిలోల బరువునెత్తి సత్తా చాటింది. మీరాబాయ్ 170 కిలోల బరువునెత్తి ప్రత్యర్థులకు గట్టిషాకిచ్చారు. కాగా, అగ స్టీనా కెమ్ నవొకొలో 175 కిలోలతో నెలకొల్పిన కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సమం చేసే అవకాశాన్ని సంజిత తృటిలో కోల్పోయంది.
ఇకపోతే.. భారత్ జూడో క్రీడాంశంలో మూడు పతకాలు కైవసం చేసుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో నవ్జోత్ చనా, మహిళల 48 కేజీల విభాగంలో సుశీలా లిక్మబామ్ రజతాలు గెలుచుకున్నారు. ఇక, మహిళల 52 కిలోల విభాగంలో కల్పనా తౌడమ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో, తొలిరోజు భారత్ ఖాతాలో మొత్తం ఏడు పతకాలు చేరాయి.
కాగా, పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. రెండు బంగారు, మూడు వెండి, రెండు రజతంలతో మొత్తం ఏడు పతకాలు కైవసం చేసుకుంది. అగ్రస్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఈ దేశం మొత్తం ఆరు బంగారు పతకాలతో మొత్తం 17 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో స్కాట్లాండ్ దేశాలు ఉన్నాయి.