శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీకృష్ణాష్టమి
Written By Selvi
Last Updated : శనివారం, 16 ఆగస్టు 2014 (16:04 IST)

వెన్న దొంగ.. శ్రీ కృష్ణుని సందేశం..!

జయతు జయతు దేవో దేవకీ నందనోయం 
జయతు జయతు కృష్ణో వృష్టి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః |
తా.. ఓ దేవకీనందనా! ఓ వృష్టివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!
 
బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట. 
 
వెన్న జ్ఞానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.
 
అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.
 
ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్నానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. 
 
ఇంకా, ప్రముఖ భాగవతోత్తములు మనకు అందించే సమాచారాన్ని బట్టి యిప్పటికి సుమారు 30వ శతాబ్దమునకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 3122లో ద్వారకా పట్టణమందు కృష్ణభగవానుడు నిర్యాణము చెందినట్లు తెలియుచున్నది. నాటినుండే కలి ప్రవేశముతో "కలియుగం" ఆరంభమైనదని చెప్తారు. దుష్ట శిక్షణ కోసం భూమిపై శ్రీకృష్ణుడిగా పుట్టిన కృష్ణుడిని జన్మాష్టమి రోజున పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.