శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (15:23 IST)

గంగిరెద్దుల వాళ్లకు - టీఆర్‌ఎస్‌ వాళ్లకు తేడా లేదు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ మేనల్లుడు హరీష్ రావులపై టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. గంగిరెద్దుల వాళ్లకు - టీఆర్‌ఎస్‌ వాళ్లకు తేడా లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా, కొండారెడ్డిపల్లిలో ఆయన మాట్లాడుతూ, డిసెంబరు 4వ తేదీన కేసీఆర్‌ కొడంగల్‌ పర్యటనను అడ్డుకుంటామన్నారు. 'నన్ను అడ్డుకోవడం హరీశ్‌ రావు, కేటీఆర్‌కు సాధ్యంకాకే.. కేసీఆర్‌ రంగంలోకి దిగారు' అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొడంగల్‌ను హైటెన్షన్‌ తీగలా రక్షించుకుంటానన్నారు. 
 
సంక్రాంతి రోజు వచ్చే గంగిరెద్దుల వాళ్లకు, టీఆర్‌ఎస్‌ వాళ్లకు తేడా లేదన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, పేదలకు 6 కిలోల చొప్పన సన్నబియ్యం అందజేస్తామని, కుటుంబానికి ఏడాదికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. 
 
సీఎం కేసీఆర్‌ తనపై కక్షగట్టి నాలుగేళ్ల కాలంలో 39 కేసులు బనాయించి తనను జైలుకు పంపారని ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస అధికారం కోల్పోతుందని.. కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో పడుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారని చెప్పారు. 
 
పట్నం బ్రదర్స్ ముఠాలతో తనను ఓడించేందుకు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు కుట్ర పన్నుతున్నారన్నారు. కేసీఆర్‌ అవినీతి పాలనకు అంతం తప్పదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కనుసైగల్లో రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన సాగుతోందని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకు అన్ని పార్టీలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడ్డాయని, డిసెంబరు 11 తర్వాత కూటమి అధికారంలోకి రావటం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.