శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (12:22 IST)

టి.జీవన్ రెడ్డికి ఏడోసారి కలిసిరాలేదు.. జగిత్యాలలో తెరాస గెలుపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోరుకు వేదికైన జగిత్యాల నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి తాటిపర్తి జీవన్‌ రెడ్డి (కాంగ్రెస్) ఘోర పరాజయం పొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచిన జీవన్‌రెడ్డికి ఈసారి తెరాస అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. హోరాహోరీ పోరులో జీవన్‌రెడ్డిపై సంజయ్‌ విజయం సాధించారు.
 
గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. తెరాస నుంచి సంజయ్‌కుమార్‌, తెదేపా నుంచి ఎల్‌.రమణ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కేవలం 7,828 ఓట్ల తేడాతో సంజయ్‌పై జీవన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే ప్రజాకూటమిలో భాగంగా ఎల్.రమణ ఈ సారి పోటీకి దూరంగా ఉండి జీవన్‌ రెడ్డికి మద్దతిచ్చారు. దీంతో ఈసారి కూడా జీవన్‌ రెడ్డి విజయం ఖాయమనే అంతా భావించారు. అయితే సంజయ్‌కుమార్‌ విస్తృత ప్రచారంతో జగిత్యాల నియోజకవర్గం జీవన్‌రెడ్డి చేజారింది.
 
1983లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 1989, 1996 (ఉపఎన్నిక), 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్టీఆర్‌, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిల మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష ఉపనేతగా పలు రాష్ట్రస్థాయి అంశాలను లేవనెత్తిన జీవన్‌రెడ్డి, పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలోనూ కీలకంగా వ్యవహరించారు. 
 
గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12 స్థానాలను తెరాస గెలుచుకున్నప్పటికీ జగిత్యాలలో మాత్రం జీవన్‌రెడ్డి విజయం సాధించారు. ఈసారి కూడా గెలిచి ఏడోసారి ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేయాలనుకున్న జీవన్‌ రెడ్డి ఆశలపై సంజయ్‌ నీళ్లుచల్లారు. ఫలితంగా జీవన్ రెడ్డికి ఏడోసారి కలిసిరాలేదు.