మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జూన్ 2024 (12:16 IST)

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు!!

naveen kumar reddy
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి విజయం సాధించారు. మే నెల 28వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగ్గా, జూన్ రెండో తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఈ లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఐదు టేబుళ్లపై ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పది గంటలకు ముగిసినట్టు ప్రకటించారు. 
 
కాగా, ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తంగా 1439 ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు మినహా అందరూ ఓటు వేశారు. వీటిలో చెల్లని ఓట్లు 21, మిగిలిన వాటిలో నవీన్ కుమార్ రెడ్డికి 762, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. దీంతో నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందినట్టుగా ఎన్నికల సంఘం అధికారకంగా ప్రకటించింది. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ కుమార్‌కు పార్టీ పరంగా సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా అభినందనులు తెలిపారు. పాలమూరు నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఆయన గెలుపునకు కృషి చేసిన భారాస ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.