శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జులై 2024 (21:19 IST)

కన్నబిడ్డలకు భారంగా వుండకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ఎలాగంటే?

Elderly Couple
Elderly Couple
కన్నబిడ్డలకు భారంగా వుండకూడదనుకున్న ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
మృతుడు కె రామచంద్రయ్య (75), అతని భార్య సరోజనమ్మ (69)లకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు వారి ఆస్తులను వారి పిల్లలకు పంచిపెట్టారు. కుమారులు అదే మండలం గొల్లకొత్తూరు గ్రామంలో నివసిస్తున్నారు. డయాబెటిక్‌తో బాధపడుతున్న సరోజనమ్మ ఆయన భర్త  కొన్ని రోజులుగా తమ కుమారుల ఇంట వుంటూ వచ్చారు. 
 
కొద్ది రోజుల క్రితం రామచంద్రయ్య గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఉన్న తమ ఇంటికి భార్యను తీసుకొచ్చాడు. తమ కుమారులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తమ జీవితాలను అంతం చేసుకుంటామని చెప్పాడు. ఇందుకు భార్య కూడా సమ్మతించింది. 
 
ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దంపతులు తిరిగి రాలేదు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు వెతకగా గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద వారి పాదరక్షలు, ఇతర వస్తువులు కనిపించాయి. 
 
బావిలో సరోజనమ్మ మృతదేహం లభ్యం కాగా, ఆదివారం రాత్రి వరకు రామచంద్రయ్య మృతదేహం ఈతగాళ్లకు లభించలేదు. అతని మృతదేహం కోసం సోమవారం కూడా వెతుకులాట కొనసాగించగా గ్రామ శివారులోని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రామచంద్రయ్యకు ఈత తెలిసి ఉండటంతో బావిలో దూకి ఉరివేసుకుని చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.