గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (11:30 IST)

వాళ్లిద్దరికి లేని సమస్య మీకేందుకు : ఫిల్మ్ జర్నలిస్ట్‌ సంఘానికి హైకోర్టు చురక

naga chaitanya - shobita
సినీ ప్రముఖులు, రాజకీయ పాప్రటీలపై జోస్యాలు చెబుతూ పాపులర్ అయిన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామికి ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై వేణుస్వామి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఊరట లభించింది. 
 
ఇటీవల నాగచైతన్య, శోభిత నిశ్చితార్థ వేడుకలు జరగగా, కొన్ని గంటల వ్యవధిలోనే వేణుస్వామి వారి వైవాహిక జీవితంపై సంచలన జోస్యం చెప్పారు. 2027 వరకే వారు కలిసి ఉంటారని తర్వాత విడిపోతారంటూ వేణుస్వామి ఒక వీడియో విడుదల చేశారు. వేణుస్వామి ఈ రకంగా జోస్యం చెప్పడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
 
అయితే ఆయన చెప్పిన జోస్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్‌తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్.. తెలంగాణ మహిళా కమిషన్‌కు వేణుస్వామిపై ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. 
 
మహిళా కమిషన్ నుంచి విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో ఆ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. వేణుస్వామి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్య, శోభితకు లేని సమస్య మీకెందుకు? అంటూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్‌ను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.