శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (17:31 IST)

మెంటల్ భర్త వద్దకు వెళ్లాలని ఒత్తిడి... పిల్లలకి కరెంట్ షాకిచ్చి చంపేసి తను కూడా...

కట్టుకున్న భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేని ఓ ఇల్లాలు ఇద్దరు బిడ్డలను చంపి తానూ బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాదులోని ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంట తడిపెట్టించింది. పోలీసుల కథనం మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జనగాం జిల్లా ఇప్పగూడకు చెందిన కత్తుల రమేశ్, స్రవంతి(28)లకు 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులిద్దరికీ సాయితేజ(10), సాత్విక(7) సంతానం.
 
రమేశ్‌కు మతిస్థిమితం సరిగా లేదు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో కొన్నేళ్ల  క్రితం స్రవంతి భర్తకు దూరమైంది. పిల్లలతోపాటు.. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్ పరిధి మన్సూరాబాద్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఉండే పుట్టింటికి వచ్చి నివశిస్తోంది. దంపతుల మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు అనేకసార్లు ప్రయత్నాలు చేయగా.. స్రవంతి భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరిస్తోంది. తల్లిదండ్రుల వద్దే ఉంటూ.. చిన్నచిన్న పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. 
 
ఇటీవల తన సోదరి కుమార్తె అనారోగ్యంతో చనిపోయిన నేపథ్యంలో.. ఆమెను ఓదార్చేందుకు స్రవంతి బేగంపేటకు వెళ్లింది. అక్కడికి వచ్చిన బంధువులు భర్తతో కలిసి ఉండాలంటూ ఆమెకు నచ్చజెప్పారు. ఆ దిశగా స్రవంతిని బలవంతంగా ఒప్పించారు. ‘విజయ దశమి పండుగ మరుసటి రోజు ఇంటికి తీసుకెళ్తానంటూ’ భర్త రమేశ్ ఆమెతో చెప్పాడు. అయితే భర్తతో కలిసి ఉండటం ఇష్టంలేని స్రవంతి ఆయన వచ్చే లోపే పిల్లలతోపాటు చనిపోవాలని నిర్ణయించుకుంది. 
 
శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు యాదయ్య, లక్ష్మి పనులకు వెళ్లగానే స్రవంతి తయారుచేసిన విషాహారాన్ని పిల్లలకు తినిపించే ప్రయత్నం చేసింది. వాళ్లు కొంచెం తిని ఇక తినమంటూ మారం చేయడంతో.. హీటర్‌తో కరెంట్ షాక్ పెట్టింది. దీంతో పిల్లలిద్దరూ మృతి చెందారు. అనంతరం స్రవంతి కూడా తనకు తాను కరెంట్ షాక్ పెట్టుకుంది. పనికెళ్లిన తల్లిదండ్రులు వచ్చేసరికి వీరు ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొంది.