1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (08:23 IST)

చిన్న సాహసం ఆమెను కాపాడింది లేకుంటే ఆ ఆటో డ్రైవర్...

ఒంటరిగా రాత్రిపూట అపరిచితుల వెంట వెళ్లవద్దని, ఆటోల్లో కూడా ఒంటరిగా ప్రయాణించవద్దని, ఒకవేళ అలా వెళ్లవలసి వస్తే బండి ఎక్కిన వెంటనే బండి నెంబర్ నోట్ చేసుకుని తెలిసిన వారికి ఎస్ఎమ్ఎస్ పంపాలని పోలీసులు చెబుతున్న జాగ్రత్తలను పాటించకపోవడం జీవితానికి ఎంత ఉపద

ఒంటరిగా రాత్రిపూట అపరిచితుల వెంట వెళ్లవద్దని, ఆటోల్లో కూడా ఒంటరిగా ప్రయాణించవద్దని, ఒకవేళ అలా వెళ్లవలసి వస్తే బండి ఎక్కిన వెంటనే బండి నెంబర్ నోట్ చేసుకుని తెలిసిన వారికి ఎస్ఎమ్ఎస్ పంపాలని పోలీసులు చెబుతున్న జాగ్రత్తలను పాటించకపోవడం జీవితానికి ఎంత ఉపద్రవం తెస్తుందో ఓ అమ్మాయి తన గ్రేట్ ఎస్కేప్ ద్వారా తెలిపింది. ఆటో డ్రైవర్ బారిన పడి కిలోమీటర్ల దూరం దారిమళ్లించిన విషయం తెలిసి వణికి పోయి కూడా ఆమె చేసిన చిరు సాహసం ఆమె మాన ప్రాణాలను కాపాడింది. దారి మళ్లించిన ఆటో డ్రైవర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులను ఆశ్రయించిన ఆమె త్రుటిలో ఒక ఘోరమైన వేధింపు నుంచి తప్పుకుంది.
 
విశాఖపట్నంకు చెందిన బీటెక్‌ చదివిన ఓ యువతి మార్చి 13న హైదరాబాద్‌కు వచ్చింది. కూకట్‌పల్లి పీజీ గ్రీన్‌హోంలోని ట్రైనింగ్‌ సెంటర్‌లో చేరింది. హైటెక్‌ సిటీ సమీపంలోని కొండా పూర్‌లో స్నేహితుల వద్ద ఉంటోంది. సంగా రెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో తన స్నేహితుల వద్దకు వెళ్లేందుకు శనివారం హైటెక్‌ సిటీ కొండాపూర్‌ నుంచి క్యాబ్‌లో పటాన్‌చెరుకు వచ్చింది. అక్కడి నుంచి బస్సులో బయలుదేరి కంది బస్టాప్‌లో దిగింది. ఐఐటీ హాస్టల్‌కు వెళ్లేందుకు అక్కడే ఉన్న ఆటోలో కూర్చుంది. 
 
కంది బస్టాప్‌ నుంచి రెండు నిమిషాల వ్యవధిలో ఐఐటీ హాస్టల్‌కు చేరుకునే అవకాశం ఉన్నా డ్రైవర్‌ దారి మళ్లించాడు. అనుమానం వచ్చి తన సెల్‌ఫోన్‌ నుంచి రూట్‌ సెర్చ్‌ చేయగా రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని తన స్నేహితురాలికి సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. రాంగ్‌రూట్‌లో వెళుతున్నారని, వెంటనే ఆటోను వెనక్కి మళ్లించాలని సూచించింది. 
 
ఎంత చెప్పినా వినని డ్రైవర్‌కు ఐఐటీకే తీసుకెళుతున్నానంటూ ఆమెను నమ్మించి మరో 10 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లాడు. ఆమె భయంతో కేకలు వేయగా బెదిరించి చేతిలో నుంచి మొబైల్‌ లాక్కున్నాడు. అప్రమత్తమైన ఆమె ఆటోలో నుంచి కిందకు దూకి ఓ కారును ఆపింది. తన పరిస్థితిని వివరించి అదే కారులో హత్నూర పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. 
 
విషయం తెలుసుకున్న జిన్నారం సీఐ వెంకటేశం, హత్నూర ఎస్‌ఐ రాజేశ్‌ నాయక్‌ పెట్రోలు పోయించుకున్న మల్కాపూర్‌ శివారులోని బంక్‌ వద్దకు వెళ్లి ఆరా తీశారు. పెట్రోలు పోసుకున్న సమయాన్ని తెలుసుకొని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో డ్రైవర్‌ ముఖం స్పష్టంగా కన్పించగా ఆటో నంబరు కనిపించలేదు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
ఆ దుర్మార్గ ఆటో డ్రైవర్ దొరుకుతాడా లేడా తర్వాతి విషయం.. ప్రమాదం ముంచుకొచ్చిన స్థితిలోనూ ఆమె ఆటోనుంచి దూకడం ద్వారా చేసిన చిరు సాహసం ఆమె ప్రాణాలను కాపాడింది.