1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (17:46 IST)

గోషా మహల్ నుంచి.. ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి.. రాజా సింగ్‌పై పోటీ...

గోషా మహల్ ప్రాంతం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజా సింగ్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున ముఖేష్ గౌడ్ కూడా గోషా మహల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ తరపున ఓ ట్రాన్స్‌జెండర్‌కి టికెట్ ఇచ్చింది ఫ్రంట్. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, సామాజిక మార్పులో భాగంగా హిజ్రాల వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇచ్చామని.. ఇదే తమ ఘనతని చెప్పారు. 
 
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున కేటాయించిన టికెట్లలో భాగంగా గోషా మహల్ నుంచి తాము పోటీ చేయాల్సి ఉందని అందుకే... తమ అభ్యర్థిగా చంద్రముఖిని ఎన్నుకున్నామని తమ్మినేని తెలిపారు. చంద్రముఖి గతంలో పలు టీవీ షోలు చేయడంతో పాటు వ్యాఖ్యాతగా, యాంకర్‌గా కూడా పనిచేశారు.
 
ఈ సందర్భంగా అభ్యర్థి చంద్రముఖి మాట్లాడుతూ... ట్రాన్స్‌జెండర్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని.. వారిపై దాడులు కూడా జరుగుతున్నాయన్నారు. అందరితో సమానంగా వారికి గౌరవం దక్కాలంటే వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిందేనని.. చట్ట సభల్లో తమ సమస్యల గురించి మాట్లాడాల్సిందేనని తెలిపారు.