శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (15:48 IST)

కుమారుడికి పెళ్లి నిశ్చయమైందని అందరికీ చెప్పింది.. ఇంటికొచ్చి చూస్తే?

కొడుకు పెళ్లి నిశ్చయం అయిందని అందరికీ చెప్పి ఇంటికి వచ్చిన తల్లికి ఆ కొడుకు కన్నీరు మిగిల్చాడు. ఇంట్లో జరిగిన ఘటన చూసి ఆమె హృదయం విలవిలలాడింది. సంతోషంగా నిశ్చితార్థం జరగాల్సిన ఇంట్లో శవం కనిపించడం ఆమెను కలతకు గురిచేసింది. 
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్‌కు చెందిన సాయమ్మ కొడుకు సంగమేష్‌కి గోపన్ పల్లికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల ఎనిమిదవ తేదీన కొడుకుకి నిశ్చితార్థం చేయాలనుకుంది. ఎడవ తేదీ ఉదయం సాయమ్మ డ్యూటీకీ వెళ్లింది. అక్కడ అందరికీ తన కొడుకు నిశ్చితార్థం గురించి చెప్పి ఆహ్వానించింది. 
 
ఉదయం డ్యూటీకి వెళ్లిన ఆమె మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చింది. తలుపు ఎంత తట్టినా ఎవరూ తీయలేదు. లోపల నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదు. అనుమానం వచ్చిన సాయమ్మ కిటికీలోంచి చూసింది. పెళ్లి జరగవలసిన కొడుకు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించాడు. చిరతో ఇనుపరాడ్డుకు ఉరివేసుకుని చనిపోయాడు. 
 
ఈ ఘటన చూసి ఆమె కన్నీరు మున్నీరు అయింది. ఆమె అరుపులు విని చుట్టుప్రక్కల వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి శవాన్ని క్రిందకు దించారు. ఈ అనుమానాస్పద మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.