తెలంగాణా రాష్ట్రానికి తీరనున్న విద్యుత్ కష్టాలు!
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన 24x7 గంటల నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టులను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతోంది. అయితే, తీవ్ర విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతున్న తెలంగాణా రాష్ట్రానికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్ని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయన వినతి మేరకు.. కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి ఆరోరా నేతృత్వంలోని ఒక ప్రత్యేక బృందం సోమవారం హైదరాబాద్కు వచ్చింది.
ఈ బృందం తెలంగాణా రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి ఆర్వింద్, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు తెలంగాణా జెన్కో కార్యాలయంలో సమావేశమైంది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం, దానిని ఎదుర్కొనేందుకు తాము చేపట్టిన చర్యలు కేంద్ర బృందానికి వివరించి, తెలంగాణా రాష్ట్రానికి కూడా నిరంతర విద్యుత్ సరఫరా ప్రాజెక్టుని మంజూరు చేయవలసిందిగా కోరారు.
అలాగే, వార్ధా - డిచ్పల్లి- హైదరాబాద్ విద్యుత్తు లైన్ను తెలంగాణ రాష్ట్రానికి అనుసంధానం చేసే పనులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని తెలంగాణా విద్యుత్ శాఖ అధికారులు చేసిన అభ్యర్థనకు కేంద్ర బృందం సానుకూలంగా స్పందించింది. ఇవికాక రాష్ట్రంలో మరికొన్ని విద్యుత్ పథకాలను అమలు చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలనే అభ్యర్థనకు కేంద్ర బృందం సానుకూలంగా స్పందించింది. దీంతో తెలంగాణకు విద్యుత్ కష్టాలు కూడా త్వరలో తీరనున్నాయి.