గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (06:09 IST)

ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్ల అధ్యయనానికి కమిటీ

ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్ల అధ్యయనానికి ప్రభుత్వం ఆరుగురు ఆర్టీసీకి చెందిన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో కమిటీ వేసింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప మిగిలిన అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ సమ్మెపై కాస్త సానుకూలంగా స్పందించింది. కోర్టు సూచించినట్లు 21 డిమాండ్లను పరిశీలించడానికి ముందుకొచ్చింది. ఇందుకు ఆర్టీసీకి చెందిన ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో కమిటీ వేసింది.

21 డిమాండ్లను పరిష్కరించడానికి పెద్దగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేవంటూ హైకోర్టు సూచించిన నేపథ్యంలో కమిటీ వీటిని పరిశీలించనుంది. ఈ మేరకు ప్రభుత్వం కమిటీకి నిర్దేశించింది. కానీ, కార్మికులతో చర్చలు జరిపే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారానికి 18వ రోజుకు చేరింది. కానీ.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి చర్చల ప్రస్తావన రాలేదు. చర్చలు జరపాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తొలిసారిగా స్పందించారు. మంగళవారం సమీక్ష నిర్వహించారు.
 
ఆరుగురు సభ్యులతో కమిటీ
ముఖ్యమంత్రి ఆదేశాలతో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా ఈడీలు ఎ.పురుషోత్తం, సి.వినోద్‌కుమార్‌, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్‌.రమేశ్‌ సభ్యులుగా ఈ కమిటీ వేశారు. ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను అందజేయనుంది.
 
అద్దె బస్సుల టెండర్లపై హైకోర్టులో పిటిషన్​
అద్దె బస్సుల టెండర్ల విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘ్ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. సమ్మె విషయం తేల్చకుండా శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని పిటిషనర్​ వాదించారు. ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఇదివరకు చెప్పిన తీర్పును ప్రస్తావించారు అదనపు ఏజీ.

అత్యవసర పరిస్థితిలో ఆర్టీసీని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. అద్దె బస్సుల టెండర్లను సవాల్‌ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఆర్టీసీకి బోర్డు లేకుండానే ఇన్‌ఛార్జి ఎండీ టెండర్లు పిలవటం చట్ట విరుద్దమని పిటిషనర్‌ వాదన వినిపించారు. సమ్మె విషయం తేల్చకుండా శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని హైకోర్టుకు ఆర్టీసీ కార్మిక సంఘ్​ తరఫున పిటిషనర్ వాదించారు.

అదనపు ఏజీ ఆర్టీసీ సొంత బస్సులు నడిపే స్థితిలో లేనందునే అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవాల్సివచ్చిందని హైకోర్టుకు తెలిపారు. ప్రజలకు తగిన ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ధర్మాసనం చెప్పిందని అదనపు ఏజీ ప్రస్తావించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే అద్దె బస్సులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

అత్యవసర పరిస్థితిలో అద్దె బస్సుల కోసం ఆర్టీసీని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉందని అదనపు ఏజీ వాదించారు. ఇప్పటికే ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న పిల్‌తో ఈ పిటిషన్​ను జతపరచాలని సింగిల్‌ జడ్జి ఆదేశించారు.
 
బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికుల అరెస్టు
ఇబ్రహీంపట్నం డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది.

ఇబ్రహీంపట్నం డిపో ముందు ధర్నా చేపట్టారు. బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.