1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2023 (16:14 IST)

ఓటుకు నోటు అంటూ కెమెరాలకు చిక్కి.. ఇప్పుడు నోటుకు సీటు అంటూ..?

ktramarao
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత బిల్యా నాయక్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు డబ్బు సంపాదించేందుకు అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. 
 
ఓటుకు నోటు అంటూ కెమెరాలకు చిక్కిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నోటుకు సీటు అని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫేక్ సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. పార్టీకి ఇది కొత్తేమీ కాదని, గతంలో ఇలాంటి సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి ఘోరంగా ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. 
 
ఓడిపోతే గడ్డం తీయిస్తానని సవాల్ విసిరిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట తప్పారని మంత్రి గుర్తు చేశారు.
 
 60 ఏళ్లుగా అధికారంలో ఉన్నా కరెంటు, తాగునీరు, సాగునీరు ఇవ్వలేని సమర్థులైన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. 
 
అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ నేతలు ఎదిగినా బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎదగలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.