ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:40 IST)

కరోనా కాలం.. సైకిల్‌పై మృతదేహం తరలింపు

కరోనా వైరస్ మనుషుల్ని చంపడమే కాదు.. మనసుల్ని కూడా చంపేస్తోంది. వైరస్సే అడ్డుగోడలా మారి... మానవత్వాన్ని చాటే ఛాన్సే లేకుండా చేస్తోంది. లాక్‌డౌన్లు, సోషల్ డిస్టాన్స్‌లు... ఇలా... కండీషన్లన్నీ కలిసి... కన్నీరే మిగుల్చుతున్నాయి.

ఈ విషాద ఘటన జరిగింది... మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో. పోలీసులు చెప్పిన దాని ప్రకారం... నిర్మల్ ఈద్ గావ్‌కి చెందిన మహారాజ్ లింగ్ రాజు(44)... కామారెడ్డి రైల్వేస్టేషన్లో హమాలి. లాక్‌డౌన్ ఉండటం వల్ల గాంధీ గంజ్ ప్రాంతంలో తలదాచుకుంటున్నాడు.

దాతలిచ్చే ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటూ ఒంటరిగా జీవిస్తున్న రాజు శనివారం రాత్రి చనిపోయాడు. ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు కంప్లైంట్ కాల్ చేశారు.

పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. కాస్త సాయం పట్టమని స్థానికుల్ని అడిగితే... కరోనా భయంతో (రాజుకు కరోనా లేదు) ప్రజలు ముందుకు రాలేదు. 
 
మృతదేహాన్ని తీసుకెళ్తున్న రాజు
పోలీసులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇప్పుడే వస్తామంటూ అక్కడి నుంచి బయల్దేరారు. ఆ తర్వాత రైల్వేలో అనాథ శవాల్ని సంస్కరించే యువకుడు రాజు వచ్చి... మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి... దాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనదారుల్ని సాయం కోరాడు.

ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్సులు కూడా అందుబాటులో లేవు. దాంతో చివరకు తనే తన సైకిల్‌పై ఆస్పత్రికి తరలించాడు. ఇంత కంటే విషాదకరమైన చావు ఏముంటుంది? ఇలా కరోనా మనుషుల్లో మానవత్వాన్ని చంపి... వికటాట్టహాసం చేస్తోంది.