1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (17:45 IST)

మామిడి కాయలు కావాలా నాయనా, ఐతే కాల్ కొట్టు పండ్లు పట్టు

కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటివద్దకే పండ్ల సరఫరా కార్యక్రమం ప్రారంభమైంది. 7330733212 ఫోన్ నెంబరు కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే ఇంటివద్దకే నాణ్యమైన పండ్లు వస్తాయి.
 
మార్కెటింగ్ శాఖ చేసిన ఈ ప్రయత్నానికి ఆదరణ పెరుగుతోంది. జంటనగారాలలో కాలనీలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు 30 ప్యాక్‌లు ఆర్డర్ ఇస్తే నేరుగా సరఫరా చేస్తున్నారు. రూ.300 చెల్లిస్తే మామిడికాయలు 1.5 కేజీ, బొప్పాయి 3 కిలోలు, సపోట 1 కేజీ, బత్తాయి 2.5 కేజీలు, 12 నిమ్మకాయల ప్యాక్, 4 కిలోల కలంగిరి ఇస్తున్నారు.
 
కాగా ఇప్పటికే మార్కెట్ అవసరాల నిమిత్తం 30 టన్నుల బత్తాయి, 10 టన్నుల మామిడి, 6 టన్నుల సపోట, 8 టన్నుల కలంగిరి (వాటర్ మిలన్), 2 టన్నుల నిమ్మ, 10 టన్నుల బొప్పాయి సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యాన పంటల రైతులను ఆదుకునేందుకు చేసిన ఈ ప్రయోగం సత్పలితాలిస్తోంది. 
 
ఇప్పటికే మొబైల్ రైతుబజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాలలో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలు పంపుతున్నారు. వారానికి జంటనగరాలలోని 3500 పై చిలుకు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. పండ్ల సరఫరాకు ప్రత్యేక కార్యాచరణతో రైతులకు ఉపశమనం కలుగుతోంది. పండ్లను వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల వద్ద నుండి నేరుగా సేకరిస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేస్తోంది.
 
వీలయినన్ని ఎక్కువ మొత్తంలో పండ్ల సరఫరాకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.