అత్తారింటి వేధింపులకు ఓ వైద్యురాలు ప్రాణాలు కోల్పోయింది. అదనపు కట్నం తేవాల్సిందిగా అత్తారింట ఆ వైద్యురాలికి వేధింపులు అధికం కావడంతో వేధింపులు తాళలేక వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అయితే మృతురాలు కుటుంబ సభ్యులు ఆ వైద్యురాలిది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన గజ్జెల లింగమూర్తి, కళావతిల రెండో కుమార్తె భవానికి హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన దోమల సత్యరాజు, శ్రీవాణి కుమారుడు పృధ్వీరాజుతో 2014, ఫిబ్రవరి 21న వివాహం జరిగింది. ఇద్దరూ ఎంబీ బీఎస్ పూర్తి చేయడంతో ఉప్పల్లోని ఆదిత్య హాస్పిటల్లో వైద్యులుగా పనిచేసేవారు. నాలుగు నెలల క్రితం వీరికి ఒక బాబు జన్మించాడు. దీంతో భవాని హాస్పిటల్ మానేసి ఇంట్లోనే వుంటోంది.
ఇటీవల సత్యరాజు తమ కుమార్తెల వద్ద కుటుంబ అవసరాలు నిమిత్తంగా డబ్బులు తీసుకున్నారు. అవి చెల్లించడం కోసం తరుచుగా కోడలిని అదనపు కట్నం కోసం వేధించేవారు. భవాని పీజీ చదువుకోవడానికి భర్త, అత్తమామలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం భవాని చెల్లెలు దేవి వివాహం జరిగింది. ఈ వివాహంలో సత్యరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ మర్యాదలు సరిగా జరుగలేదన్న కారణంపై భవాని, పృధ్వీరాజుల మధ్య చిన్న గొడవ జరిగింది.
మేడిపల్లికి వచ్చిన తరువాత మరలా గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపం చెందిన భవాని ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. అత్తింటివారు భవాని ఆత్మహత్య విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.