శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 4 ఆగస్టు 2017 (09:18 IST)

మనిషి చనిపోతే భారత్‌లో ఇంత గొప్పగా వీడ్కోలు పలుకుతారా.. చలించిపోయిన విదేశీ వనిత

సేవా కార్యక్రమాల స్వచ్చంద సేవాసంస్థకు సంబందించిన ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు భారత్ వచ్చిన ఒక విదేశీ వనిత ఇక్కడ మనిషి తుదిశ్వాస విడిస్తే ఇంత గొప్పగా వీడ్కోలు పలుకుతారా.. అంటూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఆ యువతి ముగ్ధురాలయ్యింది. పర్యాటకురాల

సేవా కార్యక్రమాల స్వచ్చంద సేవాసంస్థకు సంబందించిన ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు భారత్ వచ్చిన ఒక  విదేశీ వనిత ఇక్కడ మనిషి తుదిశ్వాస విడిస్తే ఇంత గొప్పగా వీడ్కోలు పలుకుతారా.. అంటూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఆ యువతి ముగ్ధురాలయ్యింది. పర్యాటకురాలిగా భారత సందర్శనకు వచ్చిన ఆమె ఒక అనాథ శవానికి అంత్యక్రియలుతానే చేస్తానంటూ ముందుకొచ్చింది.  ముందుకు రావడమే కాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం చేయవలసిన, పాటించవలసిన తుది క్రతువులన్నీ తెలుసుకుని, అంత్యక్రియల్ని పూర్తి చేసింది. 
 
వివరాలను పరిశీలిస్తే... ఆస్ట్రేలియాకి చెందిన జార్జియా.. సేవాభావంతో మనదేశంలో పర్యటిస్తోంది. సికింద్రాబాద్‌లోని కార్ఖానాలో ఉన్న ‘సెర్వ్‌ నీడీ’వలంటరీ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన 14 ప్రాజెక్టుల గురించి తెలుసుకునేందుకు మూడు రోజుల క్రితం నగరానికి వచ్చింది. అప్పటి నుంచి తనదైన శైలిలో అక్కడున్న అనాథ పిల్లలకు కావాల్సిన అవసరాలను తీరుస్తోంది.
ఇదే సమయంలో తనకున్న టాలెంట్‌తో కామెడీ, లాంగ్‌ స్విమ్మింగ్, వాయిస్‌ ప్లే వంటివి చేస్తూ.. వాటి ద్వారా వచ్చిన డబ్బును వివిధ సేవా సంస్థలకు దానం చేస్తోంది. అనాథ పిల్లల చదువులకు, కేన్సర్‌ రోగుల వైద్య ఖర్చులకు తన డబ్బు ఉపయోగపడటం చాలా ఆనందంగా ఉందంటోంది జార్జియా.
 
అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం ‘సెర్వ్‌ నీడీ’సేవా కార్యక్రమాల్లో ఒకటి. ఇదే క్రమంలో నగరంలోని ఓ షెల్టర్‌ హోమ్‌లో ఇటీవల ఓ మహిళ మృతిచెందింది. సెర్వ్‌ నీడీ వ్యవస్థాపకుడు గౌతమ్‌కుమార్‌ అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడ్డారు. సేవా సంస్థ కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తున్న జార్జియా.. అంత్యక్రియల క్రతువు తానే చేస్తానంటూ ముందుకొచ్చింది. 
 
‘‘ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు చేసిన భాగ్యం మీకుంది. ఈ అనాథ అతివను నా సోదరి అనుకుని నేనే తలకొరివి పెట్టాలనుకుంటున్నా’’ అంటూ గౌతమ్‌కుమార్‌ను అభ్యర్థించింది. ఆయన సరే అనడంతో.. హిందూ సంప్రదాయం ప్రకారం చేయవలసిన, పాటించవలసిన తుది క్రతువులన్నీ తెలుసుకుని, అంత్యక్రియల్ని పూర్తి చేసింది. ఈ సందర్భంగా జార్జియా మాట్లాడుతూ.. ‘‘మనిషికి వీడ్కోలు పలికే సమయంలో ఇక్కడి ఆచారాలు, పద్ధతులు చాలా గొప్పగా అనిపించాయి. బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ఆ మనిషికి విలువ ఇచ్చే సంస్కృతి చాలా నచ్చింది’’అంటూ ఆమె పేర్కొంది.
 
ఆ విదేశీ వనితకు మన దేశ సంస్కృతిలోని ఒక కోణం చూసి ఫిదా అయిపోయి ఒక అనాథ శవాన్ని తన సోదరి లాగా భావించి అంత్యక్రియలు జరిపిచడం సంతోషించవలసిందే. ఇది ఏ జన్మ సంస్కారమో మరి. కానీ మన దేశంలోనే తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక వారిని స్మశానాల్లో, పొలాల్లో, ఊర బయట వదిలేసి వస్తున్న పరమ కిరాతక సంస్కృతి కూడా ఉనికిలో ఉందని ఆమెకు తెలీదు. దేశం మీసం  తిప్పటం కాదు దేశం పరువు తీసే ఘటనలు ఆ విదేశీ వనిత  దృష్టికి రాకపోవడమే మేలేమో మరి.