డ్రోన్ల ద్వారా టెర్రరిస్టుల దాడులు: తెలంగాణలో అప్రమత్తమైన పోలీసులు
తెలంగాణలో ఉగ్రవాదులు పెచ్చరిల్లే అవకాశం ఉందని ముంబై పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ముంబై పోలీసులు హెచ్చరించడంతో సైబరాబాద్ పోలీసుల ఆదేశాలతో పూర్తిగా డ్రోన్ ఫోటోగ్రఫీని నిషేధించారు. సాధారణంగా బహిరంగ సమావేశాల్లో, ముఖ్యమైన ఉత్సవాల్లో, ప్రముఖ కార్యక్రమాల్లో ఈ మధ్య డ్రోన్లతో ఫోటోలు తీస్తున్నారు.
అయితే టెర్రరిస్టులు ఇలాంటి డ్రోన్లను ఉపయోగించి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిమోట్ సాయంతో నడిచే డ్రోన్లు, తేలికగా ఎగిరే విమానాలు ప్రస్తుతానికి నిషేధిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అంతగా అవసరం అనుకుంటే ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.