గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (17:11 IST)

ప్రాణంపోయినా సరే అవంతిని వదలను... హేమంత్ :: అయితే నీ ప్రాణాలు మేమే తీస్తాం..

హైదరాబాద్ నగరంలో తాజాగా జరిగిన పరువు హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెడ్డి కులానికి చెందిన కోటీశ్వరురాలు కుమార్తె అవంతిన వైశ్య కులానికి చెందిన చైతన్య అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని యువతి తల్లిదండ్రులు, బంధువులు కలిసి కిరాయి గూండాలతో కలిసి హత్య చేయించారు. అయితే, అవంతిని వదిలి వేయడానికి నీకు ఎంత డబ్బు కావాలంటూ యువతి బంధువులు చైతన్యను అడగ్గా.. తన ప్రాణం పోయినా సరే అవంతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వారు.. అయితే, నీ ప్రాణాలు తీస్తాం చూడు అంటూ దారుణంగా కొట్టి, గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. ఈ విషయం పోలీసులు విచారణలో వెల్లడైంది. 
 
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇదే విధంగా ప్రణయ్ అనే దళిత యువకుడు కూడా పరువు హత్యకు గురైన విషయం తెల్సిందే. దీన్ని మరచిపోకముందే ఇపుడు హైదరాబాద్‌లో చైతన్య అనే యువకుడిని చంపేశారు. అమ్మాయి తరపు వ్యక్తులు అత్యంత దారుణంగా అంతమొందించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని చందానగర్‌కు చెందిన హేమంత్, అవంతి రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయి జూన్ 11న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ మంచి ఉన్నత విద్యావంతులే. హేమంత్ ఇంటీరియల్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఈ పెళ్లి అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చనలకు ఏమాత్రం ఇష్టంలేదు. అవంతి కులాంతర వివాహం చేసుకోవడంతి వారు ఎంతో అవమానంగా భావించి నాలుగు నెలలుగా ఇంట్లోంచి బయటికి కూడా రాలేదు. 
 
ఈ నేపథ్యంలో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తన బావమరిది యుగేంధర్ రెడ్డి వద్ద తన బాధను వెల్లడించాడు. దాంతో యుగేంధర్ రెడ్డి అక్క, బావ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని తన సోదరుడు విజయేందర్ రెడ్డితో కలిసి పక్కా పథకం వేశాడు. హేమంత్, అవంతి ఉంటున్న గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్‌తో రంగంలో కదిగారు. లక్ష్మారెడ్డి బంధువులు రెండ్రోజుల కిందట హేమంత్ నివాసంలోకి బలవంతంగా చొరబడ్డారు. వీరిలో కిరాయి హంతకులు కూడా ఉన్నారు.
 
హేమంత్‌ను, అవంతిని వారు బలవంతంగా ఓ కారులో ఎక్కించి గోపన్ పల్లి వైపు తరలించారు. అయితే గోపన్ పల్లి వద్ద హేమంత్, అవంతి తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిద్దరినీ మరోసారి కారులో ఎక్కించారు. కానీ, అదే రోజు రాత్రి కారులోనే హేమంత్‌ను దారుణంగా కొట్టి చంపేసి మృతదేహాన్ని ముళ్ళపొదల్లో పడేశారు. 
 
కాగా, హత్యకు కొంత సమయం ముందు అవంతి మేనమామ యుగేంధర్ రెడ్డి... హేమంత్‌తో మాట్లాడుతూ, అవంతిని వదిలేయాలంటే నీకు ఎంత కావాలి అని అడగ్గా, ప్రాణం ఉన్నంతవరకు అవంతిని వదులుకోను అని హేమంత్ చెప్పినట్టు తెలిసింది. దాంతో యుగేందర్‌తో పాటు వచ్చిన కిరాయి హంతకులు... అయితే ఆ ప్రాణం మేం తీసేస్తాం అంటూ కిరాతకంగా చంపేసినట్టు వెల్లడైంది.