1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (06:29 IST)

రక్షణ రంగానికి హైదరాబాద్ చక్కటి వేదిక: కేటీఆర్

ఏరోస్పేస్‌, రక్షణ రంగాల పరిశ్రమలకు హైదరాబాద్‌ చక్కని వేదికని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హోటల్‌ తాజ్‌కృష్ణలో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు యూఎస్‌-ఇండియా డిఫెన్స్‌ ఒప్పందాలపై సదస్సుకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 
 
తెలంగాణలో టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఐదేళ్లలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెజాన్‌ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్‌లో రక్షణరంగ ఉత్పత్తులు చేయొచ్చని చెప్పారు.

సాంకేతిక సహకారం..
నూతన పరిశ్రమలకు తగిన సాంకేతిక సహకారం అందిస్తున్నామని కేటీఆర్ అన్నారు. బోయింగ్ సంస్థతో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. అంకుర పరిశ్రమలకు టీ హబ్ సహకారం అందిస్తోందన్నారు.

సులభతర వాణిజ్య విధానంలోనూ ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ఐదేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన విధానం అద్భుత ఫలితాలు ఇస్తోందని వివరించారు.

హైదరాబాద్​లో అంతర్జాతీయ ప్రమాణాలు...
హైదరాబాద్​లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రక్షణరంగ ఉత్పత్తులకు హైదరాబాద్‌ అనుకూలమైన ప్రదేశమని చెప్పారు. డీఆర్‌డీవో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌ నుంచి సేవలు అందిస్తోందని గుర్తు చేశారు.

వైమానిక రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని తెలిపారు. బోయింగ్, జీఈ, అధాని వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ ఉత్పత్తులు చేస్తున్నాయని పునరుద్ఘాటించారు.