1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (11:18 IST)

అమెరికాలో పాతబస్తీ వాసి దారుణ హత్య... ఎందుకని?

అగ్రరాజ్యం అమెరికాలో పాతబస్తీ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. జార్జియాలో పదేళ్లుగా ఉంటూ కిరాణా దుకాణం నడుపుతున్న ఈ వ్యక్తిని ఆయన ఇంటి వద్దనే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని పాతబస్తీ చంచల్‌గూడకు చెందిన మహ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్ (37) అనే వ్యక్తి గత పదేళ్లుగా జార్జియాలో కిరణా దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు.

ఆదివారం ఆయన ఇంటి వద్దకు వచ్చిన దుండగులు తొలుత దాడికి పాల్పడ్డారు. ఆపై కత్తితో విచక్షణ రహితంగా పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆరిఫ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స  పొందుతూ మృతి చెందాడు.
 
ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు... హత్యా స్థలానికి చేరుకుని, హత్యా స్థలాన్ని పరిశీలించారు. అలాగే, హైదరాబాద్‌లో ఉన్న మృతుని భార్య మెహ్నాజ్ ఫాతిమా, కుటుంబ సభ్యులకు చేరవేయగా, వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
 
పైగా, అమెరికాలో తమకెవరూ బంధువులు లేరని, అత్యవసర వీసాపై అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జార్జియా ఆసుపత్రిలో ఉన్న తన భర్త మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, ఆదివారం ఉదయం 9 గంటలకు తన భర్తతో ఫోన్‌లో మాట్లాడానని, అరగంట తర్వాత మళ్లీ చేస్తానని చెప్పాడని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని మెహ్నాజ్ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా, మెహ్నాజ్‌ను అమెరికా పంపించాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌, అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఏంబీటీ) పార్టీ ప్రతినిధి ఉల్లా ఖాన్ లేఖలు రాశారు.