శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (11:47 IST)

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ భూకేటాయింపుల్లో అక్రమాలు : అక్బరుద్దీన్!

ఫిల్మ్ నగర్‌లో చేపట్టిన భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర శాసనసభా వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. ఈ సమావేశాల్లో ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్నారు. భూకేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సభాసంఘం సరిపోదని, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 
 
భూకేటాయింపుల వ్యవహారానికి సంబంధించి ఎక్కడ వేలు పెట్టినా వందల కోట్ల రూపాయల అవినీతి వెలుగు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభాసంఘం ఆధ్వర్యంలో జరిగే విచారణలో పూర్తి వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదన్నారు. అందువల్ల మాజీ న్యాయమూర్తితో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
అంతేకాకుండా, జూబ్లీహిల్స్, నందగిరి సొసైటీ తదితర సంస్థలకు భూకేటాయింపుల పైన సమాచారం ఇవ్వాలన్నారు. గృహ నిర్మాణ సొసైటీలకు వక్భ్ భూములు కూడా కేటాయించారని ఆరోపించారు. 208 ఎకరాల భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్రమంతటా వక్ఫ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, కొన్నిచోట్ల వక్ఫ్, కొన్నిచోట్ల ప్రభుత్వం స్థలం అంటున్నారని, సొసైటీకి సొసైటీకి భూకేటాయింపుపై ప్రభుత్వ వివరణ సరిగా లేదన్నారు.