1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Modified: గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:45 IST)

ఐటి దాడులను రేవంత్ రెడ్డి ముందే ఊహించారా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రేవంత్‌ రెడ్డి నివాసాల్లో ఐటి శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసం కొడంగల్‌లోని ఇంటితో పాటు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న రేవంత్‌రెడ్డి తిరుమ

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రేవంత్‌ రెడ్డి నివాసాల్లో ఐటి శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసం కొడంగల్‌లోని ఇంటితో పాటు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి నేరుగా కొడంగల్‌ చేరుకుని ఈ రోజు కొడంగల్‌ నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. 
 
ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రచారం ప్రారంభానికి ఆయన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం రేవంత్ అభిమానుల్లో కలకలం రేపింది. రేవంత్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం తిరుమలలోనే ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న రేవంత్ నివాసంలో కుటుంబ సభ్యులెవరూ లేరు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ బృందంలో ఆ ఇంటిలో సోదాలు చేస్తోంది. రేవంత్ రెడ్డి సోదరులు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ, అలాగే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు.
 
అందులో రేవంత్ రెడ్డి భాగస్వామి. తమ సంస్థను లక్ష్యంగా చేసుకుని ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని రేవంత్‌ కొద్ది రోజుల క్రితమే వ్యాఖ్యానించటం విశేషం. తనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు రేవంత్. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపింది. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేనప్పుడు ఇంటికి సీలు వేసి వెళ్లాల్సిన ఈడీ అధికారులు తాళాలు ఎలా పగలగొడుతారు అంటూ మండిపడుతున్నారు రేవంత్ కుటుంబసభ్యులు.