ఉగాది పండక్కి బెల్లం లేదు... తెలంగాణా జిల్లాల్లో వింత పరిస్థితి
తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది. ఈ పండుగకు బెల్లం కరవైంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా గుడుంబాపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా పండగలకు బెల్లం కరువును సృష్టింస్తోంది.
తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది. ఈ పండుగకు బెల్లం కరవైంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా గుడుంబాపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా పండగలకు బెల్లం కరువును సృష్టింస్తోంది. నల్ల బెల్లంతో పాటు తెల్లబెల్లం అమ్మకాలపైనా మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఎక్సైజ్ అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో అటు అమ్మకందారులు.. ఇటు కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈనెల 29న తెలుగు సంవత్సరాది ఉగాది, వచ్చేనెల 5న శ్రీరామనవమి పండుగలు జరుపుకుంటుండగా పట్టణంలో తెల్లబెల్లం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. వాస్తవానికి ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యే దంపతులు వివాహ తంతులో ఒకరి తలపై మరొకరు జిలకర, బెల్లం పెట్టుకోవడం ఆనవాయితే కాదు ఆచారం కూడా. ఇక్కడ జిలకర దొరుకుతుంది కాని బెల్లం కోసం పక్క జిల్లాల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకుంటోంది.
కొత్త జిల్లాలో తొలిసంవత్సరాది ఉగాది జరుపుకుంటున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉగాది, శ్రీరామనవమి ఇతరాత్ర పండుగల సమయంలో తెల్ల బెల్లం విక్రయాలకు మినహాయింపు ఇవ్వాలని స్థానిక కిరాణ హోల్సేల్ వ్యాపారులు కోరుతున్నారు. ఉగాది పచ్చడికి, శ్రీరామనవమి పానకానికి ఉపయోగించే తెల్లబెల్లం అమ్మకాలు అనుమతి ఇచ్చి పండుగ జరుపుకునే వారి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని కోరారు.