శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2014 (18:47 IST)

ఆ 7 మండలాలు మనవి కావు బ్రదర్... కొట్లాడినా కలిపేశారు : కేసీఆర్

ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం గుర్తించిన ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోయాయని, అందువల్ల అక్కడ సమగ్ర కుటుంబ సర్వే చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొచ్చారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాము చేపట్టిన సర్వే అనుకున్న దానికంటే ఉన్నతమైన ఫలితాలు సాధించిందన్నారు. తాజా సర్వే కారణంగా హైదరాబాదులో కోటీ 20 లక్షల మందికిపైగా ప్రజలు ఉన్నట్టు తెలిసిందని అన్నారు. సర్వే ద్వారా చాలా విషయాలు తెలిశాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇలాగే సహకరిస్తే బంగారు తెలంగాణ సాధిస్తామని ఆయన తెలిపారు. 
 
రానున్న కొద్ది రోజుల్లో ఎక్కడ చూసినా వివరాలు ఉంటాయని, అర్హులకు లబ్ది చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. సర్వేకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పైసా ప్రతిఫలం ఆశించకుండా పని చేసిన ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం యువతులుకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా 51 వేల రూపాయలు అందజేస్తామని ఆయన తెలిపారు. ఆ డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వెళ్లిపోతుందని ఆయన వెల్లడించారు.
 
హైదరాబాదు అవసరాలు తీర్చేందుకు సర్వే బాగా ఉపయోగ పడిందని ఆయన వివరించారు. రాత్రి 8 వరకు సర్వే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాత్రి ఏ సమాయానికైనా వివరాలు వస్తాయని ఆయన తెలిపారు. ఎవరైనా తప్పిపోతే వారు నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. సర్వేపై విమర్శులు చేసినవారు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. ఈ వివరాలన్నీ 15 రోజుల్లో కంప్యూటరీకరిస్తామని ఆయన తెలిపారు. ఈ సర్వే చారిత్రాత్మకం అని ఆయన పేర్కొన్నారు. 
 
భద్రాచలం డివిజన్‌లో ఏడు ముంపు గ్రామాల మండలాలను ఆంధ్రాలో కలుపుతూ పార్లమెంట్‌లో చట్టం చేయగా, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారని, అందువల్ల ఆ ఏడు మండలాలు మావి కావన్నారు. ఈ కారణంగా ఆ ఏడు మండలాల్లో సమగ్ర సర్వే చేయలేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 
 
ఇక తన సింగపూర్ పర్యటనపై ఆయన స్పందిస్తూ.. సింగపూర్ వెళ్తే అంతర్జాతీయ స్థాయి ప్రచారం చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. సింగపూర్, మలేసియాలను చూస్తే రాష్ట్రంలో పట్టణాలను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో తెలుస్తుందని అన్నారు. సింగపూర్ నుంచి కౌలాలంపూర్ వరకు కార్లో ప్రయాణిస్తానని కేసీఆర్ తెలిపారు. శాటిలైట్ సిటీల నిర్మాణం, స్లమ్ ఫ్రీ సిటీ‌గా ఎలా తయారు చేయవచ్చు వంటి విషయాలన్నీ అధ్యయనం చేస్తామని ఆయన వెల్లడించారు.