1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (12:32 IST)

ఖమ్మంలో ఘరానా మోసం .. రూ.3.50 కోట్లకు కుచ్చుటోపి

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మోసానికి పాల్పడింది కూడా ఒక కుటుంబమే. తమ చుట్టుపక్కల వారిని నమ్మంచి ఏకంగా రూ.3.50 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి పత్తాలేకుండా పారిపోయారు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేయగా, కీలక మహిళా సూత్రధారి మాత్రం పారిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన పురాణం శివకుమారి ముగ్గురు కుమారులతో కలిసి ఖమ్మంలో నివసిస్తోంది. జిల్లాలోని కొన్ని సంస్థలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నట్టు చెప్పుకునేది. 
 
ఈ క్రమంలో వ్యాపారుల నుంచి కోట్ల రూపాయల విలువైన పెసలు, కందిపప్పు, బియ్యం తదితరాలను తీసుకునేది. అలాగే, నాలుగు రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ చూపి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసింది.
 
వ్యాపారులను నమ్మించేందుకు తొలుత కొంత డబ్బులు చెల్లించేది. ఆ తర్వాత రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో రూ.70 లక్షలు ఇచ్చిన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన మాలోతు సునీత మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కుమారులైన పురాణం శివ, పురాణం శంకర్‌లను ఆదివారం అరెస్టు చేశారు. కీలక నిందితురాలైన పురాణం శివకుమారి, పురాణం గోపీకృష్ణ పరారీలో ఉన్నారు. వీరిపై మొత్తం ఏడు చీటింగ్ కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.