మెట్రో రైల్పై దుష్ప్రచారం .. పనిగట్టుకుని వార్త రాశారు: కేటీఆర్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై దుష్ప్రచారం సాగుతోందని, ఈ పనులు ఆగిపోలేదని, యధాతథంగా జరుగుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం వివరణ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మైట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ఎల్ అండ్ టీ సంస్థ తాజాగా లేఖ రాసిందని వచ్చిన వార్తలు అవాస్తమన్నారు.
కొంతమంది మెట్రో రైలు ప్రాజెక్ట్ను వివాదం చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని తొక్కిపెట్టేందుకే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో స్పందిస్తారని తెలిపారు. మెట్రోపై ఎల్అండ్టీ లేఖ రాసినట్లు మీడియాలో చూసినట్లు కేటీఆర్ అన్నారు.
ఈ వార్తను కొందరు కావాలని పనిగట్టుకుని రాసినట్టుగా ఉందన్నారు. ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. మెట్రో ప్రాజెక్ట్ వివాదంపై చర్చించారు. ఆ తర్వాత ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని, కొనసాగుతున్నాయని తెలిపారు. ఎల్అండ్టీ లేఖ ఇప్పుడు రాసింది కాదని.. పాతదేనని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు తమమధ్య జరుగుతూనే వుంటాయని ఆయన అన్నారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు.