1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (13:30 IST)

ప్రేమించానన్నాడు, రెండు వారాలు గదికి పిలిపించుకున్నాడు, పెళ్ళనేసరికి..?

ప్రేమించిన యువకుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఒక యువతి పోలీసుల ఎదుటే గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన వీరబాబు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో అద్దెకుంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 
 
బీహెచ్‌ఈఎల్‌ లింగంపల్లిలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న స్వప్నతో 5 నెలల క్రితం టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. వీరబాబు తరచూ స్వప్నను తన గదికి పిలిపించుకునేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని నిలదీసింది. 
 
అందుకు వీరబాబు నిరాకరించాడు. దీంతో స్వప్న జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించినా వీరబాబు మొండికేశాడు. దీంతో స్వప్న తన తల్లితో కలిసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వీరబాబుపై చర్యలు తీసుకోవాలని కోరగా పోలీసులు అతడిని పిలిపించారు. 
 
అతనిలో మార్పులేకపోడంతో ఆగ్రహించిన బాధితురాలు తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకుంది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఆమె తన ప్రియుడి తీరుపై ఓ సెల్ఫీ వీడియోను కూడా తీసి తనను అర్థంచేసుకోవాలని కోరింది. పోలీసులు వీరబాబును అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.