మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (20:26 IST)

మున్సిపాలిటీ ఎన్నికలు డిసెంబర్లోనైనా జరిగేనా...?

కొన్ని మినహా తెలంగాణలోని పట్టణ ప్రాంత స్థానిక సంస్థల పాలకమండళ్ల గడువు జులై రెండో తేదీతో ముగిశాయి. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు అప్పుడే ప్రారంభించినప్పటికీ ఎన్నికల ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది.

నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సంఖ్యను భారీగా పెంచింది. పాత వాటితో పాటు కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టాయి.

మరికొంత ఆలస్యమయ్యే అవకాశం పురపాలక ఎన్నికలకు సంబంధించిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఇక వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. అయితే 70కి పైగా పురపాలికల్లో ఎన్నికల సంబంధిత ప్రక్రియలో తప్పులు దొర్లాయని, లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్లు ఇంకా అలాగే ఉన్నాయి.

అందుకు సంబంధించిన విచారణ ప్రక్రియ జరగడంతో పాటు న్యాయస్థానం నిర్ణయం రావాల్సి ఉంది. ఒక్కో చోట ఒక్కోరకమైన లోపాలు, తప్పిదాలు ఉన్నాయని, విచారణ జరగాలని పిటిషనర్లు అంటున్నారు. ఫలితంగా ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
 
మునిసి‘పోల్స్’ లో సత్తా చూపుతాం : లక్ష్మణ్
త్వరలో రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ బలమేంటో చూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్  అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ గెలిచాక కేసీఆర్‌ గ్రాఫ్‌ వేగంగా పడిపోతోందని అన్నారు.

ఇదే సమయంలో బీజేపీ, వెూదీ గ్రాఫ్‌ వేగంగా పెరుగుతోందన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోవని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ బలంమేంటో నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరిగాయన్నారు. గతంలో కేసీఆర్‌ను సమర్థించిన కార్మికులు, ఉద్యోగులు.. నేడు ఆయనకు దూరమయ్యారని పేర్కొన్నారు.