శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (09:24 IST)

తెలంగాణలో భారీగా ఉద్యోగ కల్పనకు అవకాశం

రాష్ట్రంలో భారీగా ఉద్యోగ కల్పనకు అవకాశం ఉందని, పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయని, వచ్చే నెలలో చాలా కంపెనీలు రాష్ట్రంలో శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్నాయని, ఆయా సంస్థల జాబితా సిద్ధం చేసి ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ఉన్నతాధికారు లను ఆదేశించారు.

మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఆయా సంస్థలను గుర్తించి, వచ్చే నాలుగేళ్లలో రానున్న పెట్టుబడులపై నివేదిక ఇవ్వాలని, వివిధ రంగాలు, విభాగాల వారీగా ఆ జాబితాలు ఇవ్వాలని ఆయన సూచించారు.

మేలైన మౌలిక వసతుల కల్పనలో ఇప్పటికే మనం ఎంతో చేశామని, ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీలపై శుక్రవారం మంత్రి కేటీరామారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఐటీరంగంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్‌ ఇక శివార్లకూ ఆ రంగాన్ని విస్తరింప చేయాలని నిర్దేశించారు.

అలాగే భవిష్యత్‌లో ఫుడ్‌ప్రాసెసింగ్‌, ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్స్‌, లాజిస్టిక్స్‌ రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. ఆయా సంస్థల రాకతో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పారిశ్రమిక పార్కుల పురోగతిని కూడా ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు.

ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, కమిషనర్‌ నదీమ్‌ అహ్మద్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఆయా శాఖల విభాగాధిపతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీలు చేసిన ప్రతిపాదనలకు సంబందించిన వివరాలను అధికారులు మంత్రి కేటీఆర్‌కు అందించారు.

వాటిలో పలు కంపెనీలు ఇప్పటికే టీఎస్‌ఐపాస్‌ ద్వారా అనుమతులు అందుకున్నాయని, అక్టోబరులో శంఖుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ప్రారంభమైన పలు ప్రాజెక్టులు, అనుమతి పొందిన కంపెనీల కార్యచరణ పురోగతిపైన మంత్రి కేటీఆర్‌ సవివరంగా చర్చించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు పూర్తి సహకారం అందించాలని అధికారులను ఆదేశించింది. ఎన్ని ఎక్కువ పెట్టుబడులు వస్తే అన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

టీఎస్‌ఐఐసి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నివ్జ్‌ు (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యానుప్యాక్చరింగ్‌ జోన్‌), కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, సిరిసిల్ల అపెరల్‌ పార్కులతోపాటు, ఇండస్ట్రియల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల పురోగతిని మంత్రి సమీక్షించారు.

మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిన ఇండస్ట్రియల్‌ పార్కుల్లో మరిన్ని కంపెనీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆఫ్‌ ఇండ స్ట్రీస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ కార్యక్రమాలపైన ఐటీ శాఖ అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ఐటీ రంగంలో గత ఐదేళ్లుగా అద్భుతమైన ప్రగతి సాధించినట్లు నివేదించారు.

ఈ రంగంలో భారీ పెట్టుబడులు నగరానికి తరలివచ్చాయని తెలియజేశారు. గత ఐదేళ్ల ఐటీ రంగం పురోగతిపై మంత్రి కేటీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న నాలుగేళ్ల కాలానికి విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలతో సమగ్ర నివేదికను అందించాలని వారికి సూచించారు.

నగరంలోని ఇతర ప్రాంతాలను ఐటీ పరిశ్రమను విస్తరించే అంశాన్ని సవాలుగా స్వీకరించాలని ఐటీ అధికారులను కోరారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకుదారులు వెతకాలని ఉద్బోధించారు.